ఐఏయస్‌ అధికారుల కొరత..

ప్రభుత్వ పాలన పట్టాలు తప్పుతుందా..!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో అమలు పరచడమనే గురుతర బాధ్యతలను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌(ఐఏయస్‌) అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మనకు తెలుసు. అదనపు కలెక్టర్‌, ‌జిల్లా కలెక్టర్‌ అం‌డ్‌ ‌మెజిస్ట్రేట్‌, ‌నగరపాలక సంస్థలు, కార్పొరేషన్ల నిర్వహణ, మంత్రిత్వ శాఖల్లో పలు స్థాయిల్లో ఉన్నతాధికారులు, సెక్రటేరియట్‌ ‌శాఖాధిపతులు, జాయింట్‌ ‌సెక్రెటరీ, డిప్యూటీ సెక్రటరీ, అడిషనల్‌ ‌సెక్రెటరీ, వివిధ సంస్థల డైరెక్టర్స్, ‌చీఫ్‌ ‌సెక్రటరీలు, కమిషనర్లు, ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ, స్పెషల్‌ ‌సెక్రెటరీ లాంటి అనేక పదవుల్లో తమ సమయం, మేధస్సు, అపార అనుభవాలను జోడించి ప్రభుత్వ పథకాలను అట్టడుగు ప్రజల ముంగిట్లోకి చేరవేసే బాధ్యతాయుత స్థానాల్లో ఐఏయస్‌ల సేవలు అనితరసాధ్యాలు, అభినందనీయాలు.

ఇలాంటి అతి ప్రాముఖ్యత కలిగిన ఉద్యోగాల్లో దేశంలోనే అత్యంత కఠిన పరీక్షగా పేరొందిన యూపియస్‌సి నిర్వహించే ‘ఇండియన్‌ ‌సివిల్‌ ‌సర్వీస్‌’ ‌ప్రవేశ పరీక్షల ద్వారా (డైరెక్ట్ ‌రిక్రూట్‌మెంట్‌) ‌నియమించబడే ఐఏయస్‌ అధికారులు దేశాభివృద్ధికి ఎనలేని సేవలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మోడెల్‌ ‌విధానం ‘నేషనల్‌ ‌స్టాండర్డస్ ‌ఫర్‌ ‌సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌ట్రేయినింగ్‌ ఇనిస్టిట్యూట్స్(‌యన్‌యస్‌సియస్‌యు)’ ద్వారా ఆధునిక పద్దతుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఇదే కాకుండా రాష్ట్ర సివిల్‌ ‌సర్వీస్‌ ‌కాడర్‌ ‌నుంచి కూడా పరిమిత సంఖ్యలో ఐఏయస్‌లుగా పదోన్నతులు పొందడం జరుగుతోంది.

ఐఏయస్‌ల ముఖ్య విధులు
ఐఏయస్‌ అధికారుల ముఖ్య విధుల్లో రెవెన్యూ వసూళ్లు, రెవిన్యూ కోర్టుల నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, ఎక్సిక్యూటివ్‌ ‌మెజిస్ట్రేట్‌ ‌విధులు, చీఫ్‌ ‌డెవలప్‌మెంట్‌ అధికారులుగా విధులు, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ, ప్రజానిధుల ఖర్చుపై పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్‌లో పలు మంత్రిత్వ శాఖల్లో పాలసీల రూపకల్పనతో పాటు అమలు విధివిధానాలు రూపొందించడం లాంటి పలు భాద్యతాయుత విధులను నిర్వహిస్తూ దేశాభివృద్ధికి కీలకంగా మారడం చూస్తున్నాం.

దేశవ్యాప్తంగా ఐఏయస్‌ల కొరత
దేశవ్యాప్తంగా మార్చి 2022లో 22 శాతం ఐఏయస్‌ అధికారుల కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించడం మనకు విధితమే. జె అండ్‌ ‌కెలో 57 శాతం, త్రిపురలో 40 శాతం, నాగాలాండ్‌లో 37 శాతం, కేరళలో 32 శాతం, ఝార?ండ్‌లో 31 శాతం ఐఏయస్‌ల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా 6,789 ఐఏయస్‌ ఉద్యోగాలు ఉండగా, ప్రస్తుతం 5,317 మంది మాత్రమే పని చేస్తున్నారు. మ్నెత్తం 6,789 పోస్టుల్లో 4,712 మంది యూపియస్‌సి ద్వారా నేరుగా నియమించబడగా, మిగిలిన 2,077 మంది రాష్ట్ర సివిల్‌ ‌సర్వీస్‌ ‌కాడర్‌ ‌నుంచి పదోన్నతులతో (కన్ఫర్డ్ ఐఏయస్‌) ‌మించబడతారు. ప్రస్తుతం పని చేస్తున్న 5,317 మందిలో 3,862 మంది యూపియస్‌సి ద్వారా, 1,455 మంది రాష్ట్ర సివిల్‌ ‌సర్వీస్‌ ‌కేడర్‌ ‌నుంచి ఉన్నారు. దేశంలోని ఐఏయస్‌ ‌పోస్టులు ఖాళీలు ఉండడంతో దేశ సుస్థిరాభివృద్ధికి, పథకాల అమలుకు తీవ్ర విఘాతంగా వర్ణించబడుతోంది. దాదాపు అధిక శాతం ఐఏయస్‌ అధికారులకు సనీసం ఒక్కటైనా అదనపు శాఖల బాధ్యతలు ఇవ్వడంతో వీరిపై తీవ్ర ఒత్తిడి, క్రియాశీలత తగ్గుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా 2012 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా 180 మంది ఐఏయస్‌ అధికారులను నియమిస్తూ వస్తున్నప్పటికీ ఖాళీలు ఉండడం జరుగుతోంది. 2016 నుంచి 2020 వరకు 898 మంది ఐఏయస్‌లను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా యూపీలో 387 మంది, యంపీలో 258, అగ్‌ముట్‌(అరుణాచల్‌, ‌గోవా, మిజోరామ్‌, ‌యూటీలు)లో 235, మహారాష్ట్రలో 232 మంది ఐఏయస్‌ ‌డైరెక్ట్ ‌రిక్రూటీలు సేవలు అందిస్తున్నారు. యూపీలో 652 ఐఏయస్‌ ‌పోస్టుల్లో 560 మంది (560/652) మాత్రమే పని చేస్తున్నారు. అదే విధంగా బీహార్‌లో 226/359, వెస్ట్ ‌బెంగాల్‌లో 299/378, తమిళనాడులో 323/376, కేరళలో 148/231, మహారాష్ట్రలో 341/415, కర్నాటకలో 272/314, రాజస్థాన్‌లో 261/313, గుజరాత్‌లో 261/313, పంజాబ్‌లో 193/231, ఓడిసాలో 185/248, అగ్‌ముట్‌లో 328/403, అస్సాం-మేఘాలయల్లో 193/263 ఐఏయస్‌ అధికారులు మాత్రమే సేవలు అందిస్తున్నట్లు తేలింది.

తెలుగు రాష్ట్రాల్లో ఐఏయస్‌ల కొరత
తెలంగాణ రాష్ట్రంలో 208 ఐఏయస్‌ ‌పోస్టులు, 119 ఐపియస్‌ల్లో పోస్టులు మాత్రమే మంజూరు అయినాయని, జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచడంతో వాటి సంఖ్యను భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. నేడు దాదాపు 164 మంది ఐఏయస్‌లు పని చేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఆంధప్రదేశ్‌లో 239 ఐఏయస్‌ ‌పోస్టులు ఉండగా, 194 మాత్రమే పని చేస్తున్నట్లు గత వివరాలు తెలుపుతున్నాయి. చట్ట సభలు చేసిన చట్టాలను ప్రజల చెంతకు చేర్చడం, క్షేత్ర స్థాయిలో  అమలు పరిచడమనే గురుతర బాధ్యతలను నిర్వహించడానికి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా ఐఏయస్‌ అధికారులు నిస్వార్థ, నిరంతర, నిబద్ధతగా అమూల్య సేవలను అందిస్తున్నారు. దేశ ప్రగతికి కేంద్ర బిందువులుగా నిలుస్తున్న ఐఏయస్‌ల కొరత ప్రగతి నిరోధకంగా మారుతోందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొద్ది మంది ఐఏయస్‌లు స్వార్థపూరితంగా, అవినీతిమయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు ప్రజలకు హాని చేస్తున్నారనే వాదనలు కూడా పొడచూపడం దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా నిలుస్తున్నది. దేశవ్యాప్తంగా విశిష్ట సేవలు అందిస్తున్న ఐఏయస్‌ అధికారులు సన్మార్గంలో, బడుగుల పక్షపాతులుగా చట్టబద్ధంగా విధులు నిర్వహించాలని కోరుతూ, వారి ఖాళీలను సత్వరమే నింపడం ద్వారా ప్రగతి రథం వేగంగా పరుగిడే ప్రయత్నాలు చేయాలని సామాన్యపు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

burra madhusudhan reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *