పది రాష్ట్రాల్లో పిఎఫ్ఐ కార్యాలయాల్లో సోదాలు
దాదాపు వందమంది వ్యక్తుల అరెస్ట్
కేంద్ర హోమ్ శాఖ పర్యవైక్షణలో ఎన్ఐఎ దాడులు
దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. 10 రాష్టాల్ల్రో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 100 మంది పీఎఫ్ఐకి చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ దాడులు ఉత్తర్ప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 10 రాష్టాల్ల్రో గురువారం వేకువజామున జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తుండగా… తెలంగాణలో హైదరాబాద్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో సోదాలు చేపట్టారు. కరీంనగర్ లోనే ఏకంగా 8 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉత్తర్ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యాలయాలు దాని అనుబంధ సంస్థలలలో ఎన్ఐఏ బృందాలు తెల్లవారు జామునుండి సోదాలు చేస్తున్నారు.
ఎస్ డి పి ఐ నేతలు అబ్దుల్ వారిస్, ఇంతియాజ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ వందమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. ముఖ్యంగా టెర్రర్ ఫండింగ్, మిలిటెంట్లుగా మారేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహించడం, నిషేధిత ఉగ్రసంస్థలో చేరేలా యువతను ప్రోత్సహించడం వంటి ఆరోపణపై దర్యాప్తులో భాగంగా దాడులు చేపట్టారు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలోని పిఎఫ్ఐ హెడ్ ఆఫీసుకు అధికారులు సీల్ చేశారు. ఉప్పల్, ఘట్ కేసర్ ప్రాంతాల్లోని పీఎఫ్ఐ కార్యకర్తల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. కరీంగనర్ లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. గుంటూరు లోని ఆటోనగర్ లో తనిఖీలు చేపట్టారు.
కేరళలో 22 మందిని, కర్ణాటక, మహారాష్ట్రలో 20 మంది, తమిళనాడులో 10 మంది, అసోంలో 9 మంది, యూపీలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఏపీలో ఐదుగురు, మధ్య ప్రదేశ్ లో నలుగురు, పుదుచ్చేరి ముగ్గురు, ఢిల్లీల్లో ముగ్గురు , రాజస్థాన్ లో ఇద్దరిని అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్, ఆంధప్రదేశ్లోని నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది. వీరిని హైదరాబాద్లో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఇవే అతిపెద్ద దాడులు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు నిర్వహించడం, నిషేధిత సంస్థలలో చేరడానికి వ్యక్తులను ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా ఈ మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాద మూలాలు, శిక్షణ వంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున దేశంలో బయటపడడం వల్ల హోం శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.




