కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీ కెసిఆర్ నగర్ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 22 : సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండోదశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్దిదారులకు లాంఛనంగా ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్షిప్ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు.




