ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత
బిజెపి ఎంపి లక్ష్మణ్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. కరువు, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగురున్నాయని..రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు. మజ్లిస్ను గెలిపించమని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు. మజ్లీస్కు సపోర్ట్ చెయ్యడం హనుమంతరావు లాంటి వ్యక్తులకు ఇష్టం లేదన్నారు.
సొంత నేతల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీలకు కొమ్ము కాసే వ్యక్తులు జైళ్లలో ఉన్నారన్నారు. హామీ ల విషయంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. అబద్ధాలకు కాంగ్రెస్, అహంకారనికి బీఆర్ఎస్లు మారుపేరు అంటూ విమర్శలు గుప్పించారు. తనపై, తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని కాంగ్రెస్ రిఫరెండంగా ప్రకటిస్తారా..అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.





