ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన యువతి

– పోలీస్‌ ‌వ్యాన్‌కు ఎదురు నిలబడి ఆందోళనకారుల విడుదలకు యత్నం
– సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

ముంబై, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలంటూ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌కు ఓ యువతి అడ్డుగా నిలిచి నిరసన తెలిపారు. దాదర్‌లోని శివాజీ పార్క్ ‌సపంలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో రియా యాదవ్‌ అనే యువతి ఈ సాహసానికి పాల్పడ్డారు. వర్షంలో హుడీ, టోపీ ధరించి పోలీసు వ్యాన్‌ ఎదుట నిల్చున్న ఆమెను చూసి.. అక్కడి నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్పటికే అదుపులోకి తీసుకున్న కొందరు నిరసనకారులను పోలీసులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా రియా స్పందిస్తూ.. ’పోలీసులు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదు. వారు బాధ్యతగా వ్యవహరించకపోతే పౌరుల కోసం మేమే బాధ్యత తీసుకుంటాం’ అని అన్నారు. తాను విద్యార్థిని కాకపోయినప్పటికీ.. విద్యార్థుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు.. దిల్లీలో నిరసనకారులపై టియర్‌గ్యాస్‌, ‌లాఠీఛార్జ్ ‌వంటి ఘటనలనూ ఆమె ఖండించారు. రియా యాదవ్‌.. ‌నటి, మోడల్‌, ‌పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు లక్ష మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. పలు మ్యూజిక్‌ ‌వీడియోల్లో నటించిన ఆమె.. ఇటీవల ’దిల్‌బారా’ అనే సాంగ్‌తో మెరిశారు. అలాగే ’రియాసత్‌’ ‌పేరుతో ఓ చేనేత వస్త్రాల బ్రాండ్‌నూ నిర్వహిస్తున్నట్టు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *