దేశం గర్వించేలా యంగ్ ఇండియా స్కూల్స్

  • విద్యార్థులను సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేస్తాం..
  • అద్భుతమైన మేదస్సుతో మానవ వనరులను అందిండమే లక్ష్యం
  • రూ.21 వేల కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు
  • ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మధిర, ప్రజాతంత్ర, మే 3 : దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (young india school) ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన మేదస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్దేశం అన్నారు. సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విధంగా విద్యా బుద్ధులు చెప్పే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేశామని వివరించారు. ప్రజా ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాదిరిగా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి స్కూల్స్ లేవన్నారు. గత దశాబ్ద కాలంగా బిఆర్ఎస్ కబంధ హస్తాలలో కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధికి దూరమైందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత సకల సదుపాయాలతో కూడిన విద్యా, వైద్యం అందించడానికి ముందుకు వెళ్తున్నామన్నారు.

గత ప్రభుత్వం ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైందని అన్నారు. చిత్తశుద్ధి, సంకల్ప బలంతో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్ ను మొదటి సంవత్సరంలోనే మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్తు మంత్రిమండలి సమష్టిగా ఆలోచన చేసి అదనంగా మరో 47 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను మంజూరు చేశామని వెల్లడించారు. 21 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు కాబోతున్నాయని, ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు క్రికెట్, ఫుట్బాల్ అవుట్డోర్, ఇండోర్ ఆటలకు సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఉండే విధంగా దాదాపు 25 ఎకరాల్లో డిజైన్ చేశామని వివరించారు.

విద్యార్థులతో పాటు టీచింగ్ స్టాఫ్  ఉండే విధంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పాఠశాల నిర్వాహణకు సంబంధించి వాటర్, విద్యుత్, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇందులోనే వసతి ఉండేలా డిజైన్ చేశామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ లు, యాంపీ థియేటర్, సైన్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన చేసే అధ్యాపక బృందాన్ని నియమిస్తామన్నారు. విద్యార్థులకు శరీర ధారుఢ్యం పెరిగే విధంగా కావలసిన పోషకాహారంతో కూడిన డైట్ను అందించడంతో పాటు మేదో సంపత్తి పెరగడానికి కావలసిన విద్యాబోధన ఉంటుందన్నారు.  తెలంగాణ ప్రజా ప్రభుత్వ ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్ గా నిలువబోతాయన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణకు వచ్చి ఈ పాఠశాలలను సందర్శించి ఇదే తరహాలో విద్యాబుద్ధులు నేర్పాలనే ఆలోచనతో వారి రాష్ట్రాల్లో పాఠశాలల ఏర్పాటుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రోల్ మోడల్ అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న ప్రతి రూపాయి పోగేసి ప్రజల భవిష్యత్తు కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page