వారం పది రోజులుగా పౌర సమాజంలో నానుతున్న పేరు కర్రిగుట్ట. చర్చ అంతా తెలంగాణ,చత్తీస్గడ్ సరిహద్దులో ఉన్న ఈ సువిశాలమైన గుట్టలపైనే . దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మిలటరీ, వివిధ రకాల పోలీసు బలగాలు ఈ గుట్టలను మావోయిస్టుల స్థావరాలుగా గుర్తించి దాడులు జరుపుతున్నారు. వైమానికంగా హెలికాప్టర్లు, డ్రోన్లు వాడుతూ గుట్టలను అణువణువుగా పరిశీలిస్తున్నారు. అలాగే అన్ని దారులు మూసి వేస్తూ, ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ ఆదివాసులను కట్టడి చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ, చత్తీస్గడ్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఆపరేషన్ కర్రిగుట్ట పేరుతో,కర్రి గుట్టల ఆక్రమణ కార్యాచరణలా కొనసాగుతున్నది.
చత్తీస్గడ్ ప్రభుత్వం చాలా కాలంగా చర్చల విషయం ఎజెండాపై ఉంచింది. కాకపోతే కొన్ని కండిషన్లు పెట్టింది. విశాలమైన రోడ్ల నిర్మాణానికి, ఖనిజాల వెలికితీత తరలింపులో ఆటంకం లేకుండా చూడడం, ఆయుధాలు వదిలేయడం వంటివి కీలకమైనవి. అన్ని వైపులా మిలిటరీ బలగాలను, పోలీసులను పంపిస్తూ, విచక్షణారహితంగా దాడులు, కాల్పులు జరుపుతూ ఆదివాసులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. వారి ఊళ్ళని నుండి తరిమి వేసే ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు. వీలైన చోటల్లా, ఇన్ ఫార్మర్లతో సమాచారం సేకరించి మావోయిస్టు నాయకత్వాన్ని నిర్మూలిస్తూనే ఉన్నారు. చర్చల్లో కీలకమైన మౌలిక అంశాలతో ఆటంకాలు కలిగిస్తూనే శాంతి వచనాలు వల్లిస్తున్నది.
దేశంలో శాంతి చర్చల అనివార్యతను గుర్తించిన తెలంగాణ పీస్ కమిటీ మావోయిస్టులు, ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించి ప్రజల కోసం చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పౌర సమాజ పిలుపుకు స్పందించిన మావోయిస్టు పార్టీ ఈ ప్రతిపాదనకు బహిరంగంగానే అంగీకరించింది. కేంద్రం మాత్రం పట్టించుకోలేదు, పెడచెవిన పెట్టింది. బేషరతుగా ఆయుధాలను విడాలనే విజ్ఞప్తిని పలువేదికలపై స్పష్టం చేస్తూ వచ్చింది. ఇదిలా జరుగుతుండగానే ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ, మిలటరీ కేంద్రాలుగా మార్చేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించుకుంది. అందులో భాగమే ఆపరేషన్ కర్రి గుట్టలు. చర్చల కోసం, శాంతి కోసం, మూలవాసుల,ఆదివాసుల రక్షణ కోసం పౌర సమాజం చేస్తున్న కృషిని పాలకవర్గాలు పట్టించుకోకుండా అణచివేత నిర్మూలనే పరిష్కారంగా ముందుకు వెళ్తున్నాయి. ఇంత జరుగుతుంటే శాంతి చర్చలకు తావెక్కడిది.
. కార్పొరేట్ సంస్థలకు మనో ధైర్యం కల్పించడానికి పాలకులు దేశ పౌరులపై చేస్తున్న యుద్ధానికి దురాక్రమణ కాంక్ష తప్ప, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంపై దృష్టి ఉన్నట్లు కనబడటం లేదు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్ బెంగాల్ లలో విస్తరించి ఉన్న అపార ఖనిజ సంపద,వనరుల దోపిడీ లక్ష్యంగా అదాని, అంబానీల కోసం రాజకీయాలకతీతంగా ప్రపంచ పోలీస్ ఆదేశాలతో జరుగుతున్న దాడి ఇది. ఇంకా లోతుగా చెప్పాలంటే దక్షిణాదిపై ,ఉత్తరాది పాలకులు ఆధిపత్యం కోసం అమలు చేస్తున్న పక్కా ప్రణాళిక. నాడు త్రేతా యుగంలో రాముడి కాలం నుండి ద్వాపర యుగంలో పాండవులు కలుపుకొని ఉత్తరాది పాలకులు దండకారణ్యం పై దాడి చేసి అక్కడి మూలవాసులను రాక్షసులుగా చిత్రీకరిస్తూ మారణకాండ కొనుసాగించినవారే. నేడు దేశభక్తి ముసుగులో, దేశ పౌరుల గుండెలపై గన్ను పెట్టి సాగిస్తున్న మానవహననమే. శాంతి చర్చలు చేస్తే మావోయిస్టులు బలపడతారనే నెపంతో, పౌర సమాజ సూచనలు ఉల్లంఘిస్తూ, అమాయక ప్రజలపై హింసకాండను కొనసాగిస్తూ అంతర్యుద్ధానికి తెర లేపుతున్న పాలక పార్టీల వైఖరి అప్రజాస్వామికం. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సలైట్లతో చర్చల తంతు నడుపుతూనే నల్లమలలో, రాష్ట్రంలోని అనేక జిల్లాలలో నక్సలైట్ల ఆనుపానులు తెలుసుకొని వేలాది మందిని కాల్చి చంపింది. రాష్ట్రంలో వారి ఉనికిని ప్రశ్నార్ధకం చేసింది. ప్రస్తుతం దండకారణ్యం లో అమలు చేస్తున్న విధానం కూడా అలాగే కనబడుతుంది.
. అపార ఖనిజ సంపాదనంతా గుజరాత్ తలరలించే అభివృద్ధి నమూనా, బ్రిటీష్ పాలకుల విధానాలకు సరిగ్గా నప్పుతుంది. తెలంగాణకు ఇచ్చిన హామీలలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయం తెరమరుగయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భద్రాచలం, ములుగుకు రెండు బెటాలియన్ల సిఆర్పిఎఫ్ బలగాలను కోరడం లోనే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద వైఖరి బయటపడింది. పౌర సమాజ ప్రతినిధులు లోతుగా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పక తప్పదు. మీటింగులకు,నిరసన కార్యక్రమాలకు అనుమతులు, మంత్రివర్గ ప్రతినిధులు మేధావులను, బుద్ధి జీవులను, పలు సంఘాలను కలవడంతోనే ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడిందనే భ్రమలో కొట్టుకుపోయారు. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా యదేచ్చగా రాజ్యమేలుతుంది. మహిళలపై, దళితులపై, బలహీనవర్గాల పైన దాడులు యధావిధిగా జరుగుతున్నాయి. అన్యాక్రాంతమైన భూములలో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది. కాకపోతే ఉన్నోడిపట్ల అమీబాలా ప్రవర్తిస్తుందన్నది విమర్శగానే మిగిలింది. అందరికీ ఉచిత విద్యా, వైద్యం అందని ద్రాక్ష గానే మిగిలింది. మేధావి వర్గం లో కొంత భాగాన్ని కొనుగోలు చేసి / ప్రలోభపెట్టి తన ఆధీనంలో ఉంచుకున్న ప్రభుత్వం నిరసనను కొంత బహిర్గతం కాకుండా నిరోధించగలిగిందనేది స్పష్టం.
. చైతన్యవంతమైన తెలంగాణ పౌర సమాజం అంతో, ఇంతో ప్రతిఘటిస్తూనే వస్తున్నది. పాలకులు ఇప్పటికైనా బుద్ధి జీవుల, ఉద్యమకారుల సూచనల పాటించకపోతే భవిష్యత్తు మరింత సంక్షేమ పరిస్థితుల్లోకి నెట్టివేయడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాట సందర్భంలో, తెలంగాణను భారత్ యూనియన్లో కలుపుతూ పటేల్ సైన్యం కమ్యూనిస్టు పార్టీలపై మిలటరీ చర్య చేపట్టింది. దేశ పౌరులపై మిలిటరీ దాడులు చేయడం ఏ సూత్రాలకు విరుద్ధం కాబట్టి, దాని పోలీస్ చర్యగా ప్రకటించింది. దేశ భద్రతకు ఏర్పడిన సైన్యాన్ని దేశ పౌరులపై ప్రయోగించి చంపడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఇప్పుడు దండకారణ్యంలో మాత్రం మార్చి 26 నాటికి మావోయిస్టు రహిత ప్రాంతంగా మారుస్తామంటూ మూలవాసులను, ఆదివాసులను బలవంతంగా అక్కడి నుండి తరలించి వేస్తుంది. అయినా జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అమలు సమస్య చర్చల్లో లేకపోవడం శోచనీయం. అమాయక ఆదివాసీ ప్రజలపై మావోయిస్టు ముద్ర తో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ భయాందోళనలకు గురిచేస్తూ, వారి గూడాల నుండి తరిమి వేస్తున్నది. ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఉన్న పరిస్థితిలో కూడా మూలవాసులపై జరుగుతున్న హింస పెట్రేగిపోవడం విషాదకరం. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు ఊపితిత్తుల్లా ఆక్సిజన్ అందిస్తున్న, పర్యావరణాన్ని కాపాడుతున్న దండకారణ్య రక్షణ సమస్య. అటవీ భూభాగాన్ని, కొండలు కోనలు, నదీ నదాలు, జలాశయాలను కలుషితం చేస్తున్నది.
. శాంతి చర్చలు కేవలం మావోయిస్టు సమస్య కాదు. దేశ భద్రత సమస్య, దేశ సంపద సమస్య, ఆదివాసీ జాతుల మనుగడ సమస్య. అంతర్జాతీయ న్యాయ స్థానాల సూచనలు, సూత్రాల ఉల్లంఘన యాదేచ్చగా జరుగుతున్నా గొంతు పెగలడం లేదు. పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయాలు, పరిశీలనలు, రిపోర్టుల ఆచూకీ లేదు. ప్రశ్నకు భయపడుతున్న మేధావులు,బుద్ధి జీవులు, సంఘసంస్కర్తలు. కళ్లప్పగించి చూస్తున్న భారతీయ సమాజం. అటు ఈశాన్య రాష్ట్రాల్లో జాతర సమస్య, కాశ్మీర్ లో మత సమస్య, దేశమంతా నిరుద్యోగం, ఉపాధి, విద్యా, వైద్యం పీడిత ప్రజలను భయ, ఆందోళనలకు గురి చేస్తున్నాయి. సంపద అంతా ఒకరిద్దరి చేతులకు అప్పనంగా అందజేయబడుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒక్కటొక్కటిగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. అన్నిచోట్ల శాంతిభద్రతల సమస్య ఏర్పడి పాలకుల, దోపిడీదార్ల రక్షణ కోసం పోలీస్/ మిలిటరైజేషన్ పరిష్కారంగా అడుగులు వేస్తున్నవి. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో కూడా దండకారణ్యంలో కానీ, తెలంగాణలో కానీ ఆదివాసీల సమస్యలపై, వరుల దోపిడీపై ఎలాంటి చర్చ చేయలేదు. దేశ రాజధానిని కుదిపేసిన రైతాంగ పోరాటంపై వారి డిమాండ్లపై సమాలోచన చేయలేదు.. మావోయిస్టు ఎజెండా ప్రకటించిన అప్పటి టిఆర్ఎస్, ఇప్పుడు బి ఆర్ఎస్ త్వరలో జరపబోయే రజతోత్సవ వేడుకల్లో ఎలా స్పందిస్తుందో చూడాలి. దేశ ప్రధాన సమస్య ఆదివాసుల మనుగడ, రక్షణ. అంతేగాని వాడికి అండగా నిలిచి, దేశ ఖనిజ సంపాదన వనరులను రక్షిస్తున్న మావోయిస్టుది కాదు. ఈ కీలకాంశాన్ని ప్రజలు గుర్తించేలా చేయడం బుద్ధి జీవుల సామాజిక బాధ్యత. ఇందుకు అనుగుణంగా ప్రజల సమాయత్తం చేయడం ఉద్యమకారుల కర్తవ్యం ప్రస్తుత తరుణంలో జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, ప్రజలు ప్రజాస్వామికవాదులు, కవులు కళాకారులు, కార్మికులు, రైతాంగం, విద్యార్థి యువత దేశ సంపద రక్షణ కోసం, మూలవాసుల ఆదివాసుల ప్రాణాలను కాపాడడం కోసం తమ వైఖరిని ప్రకటించి కార్యాచారణను ప్రకటించి అమలు చేయడం అత్యవసరం.
. … రమణా చారి