ఊహించినదే నిజమైంది

– పెట్రోల్, డీజిల్‌లపై రూ.3 పెంపు
 – ఆయిల్ కంపెనీల నిర్ణయం

న్యూదిల్లీ, మే 15: ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ చమరు కంపెనీలు దాదాపు 11 వారాలపాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లీటరుకు రూ.3 పెంచాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్దఎత్తున ప్రచారం జరిగింది. సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచడం గమనార్హం. ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సీఎన్‌జీ వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. కిలో సీఎన్‌జీని రూ.2 చొప్ప్పున పెంచాయి. ఏపీలో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్ప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. దిల్లీలో పెట్రోల్ ధరలు రూ.97.77, కోల్‌కతాలో రూ.108.74, ముంబయిలో రూ.106.68, చెన్నైలో రూ.103.67గా ఉండనున్నాయి. ఇక డీజిల్ ధరలు దిల్లీలో రూ.90.67, కోల్‌కతాలో రూ.95.13, ముంబయిలో రూ.93.14, చెన్నైలో 95.25గా ఉండనున్నాయి.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లవి పనీపాటా లేని విమర్శలు 
– మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు పనీపాటా లేదని, అందువల్లే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీల నేతల మాటలు విని మోసపోవద్దంటూ ప్రజలకు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో శుక్రవారం స్పందించారు. దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరిగాయని, పెంచిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పారు. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావంతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అనివార్య మైందన్నారు. అంతేకానీ ఇది ప్రజల విÖద భారం వేసేందుకు కాదన్నారు. క్రూడాయిల్ దిగుమతికి భారీగా ఖర్చు అవుతున్నదని, అందుకోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ తదితర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని  కిషన్ రెడ్డి సోదాహరణగా వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *