– ‘నీట్’ విద్యార్థుల ఆత్మహత్యపై రాహుల్ ఆందోళన
– ప్రభుత్వం ఎప్ప్పుడు కళ్లు తెరుస్తుందో ?
న్యూదిల్లీ, మే 15: ‘నీట్’ రద్దుతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులవి వ్యవస్థలు చేసిన హత్యలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు. లఖింపూర్ ఖేరీకి చెందిన 22 ఏళ్ల హృతిక్ మిశ్రా చివరిసారిగా ‘నేను ఇకపై పోటీ పరీక్షలు రాయను‘ అని చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. మూడోసారి ‘నీట్’ రాస్తున్న హృతిక్.. పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అలాగే ఉనీజీలో కూడా పరీక్ష రాసిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. ఈ ఘటనలు కేవలం ఆత్మహత్యలు కావని, అవినీతి వ్యవస్థ చేసిన హత్యలని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్ష చేతిలో విద్యార్థులు ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో బలయ్యారని అన్నారు. 2015 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా 148 పరీక్షల కుంభకోణాలు వెలుగుచూశాయని ఆరోపించారు. వాటిలో 87 పరీక్షలు రద్దయ్యాయని, దాదాపు తొమ్మిది కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమైందని పేర్కొన్నారు. ఈ 148 కుంభకోణాల్లో కేవలం ఒక్కరికే శిక్ష పడిందని, సీబీఐ 17 కేసులు, ఈడీ 11 కేసులు నమోదు చేసినప్పటికీ ఎవరూ బాధ్యత వహించలేదని విమర్శించారు. ప్రత్యేకంగా నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య ప్రవేశ పరీక్షల్లోనే 15 కుంభకోణాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో బాధ్యులైన అధికారులు, మంత్రులు రాజీనామా చేయకపోవడం అత్యంత సిగ్గుచేటన్నారు. కొందరిని తొలగించినట్లు చూపించి తిరిగి ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు. మోసానికి సహకరించే వారికి బహుమతులు లభిస్తుండగా పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి విÖలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్లు కావాలని ప్రశ్నించారు. విద్యార్థుల బాధ తన బాధ అని, వారి భవిష్యత్తును దోచుకున్న వారు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ఎంత కాలం పట్టినా సరే ఎవరినీ వదిలిపెట్టం.. ఈ యుద్ధంలో మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం అంటూ ధైర్యాన్ని ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




