– 1947 నుంచి పాక్ది ఉగ్ర బాటే
– పటేల్ మాటలు వింటే ఈ పరిస్థితి దాపురించేది కాదు
– దేశ ప్రజల్లో వెల్లివిరిసిన దేశభక్తి
– రెండోరోజు గుజరాత్ పర్యటనలో మోదీ
భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును పెరికివేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం ప్రధాని మోదీ గాంధీనగర్లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మహాత్మా మందిర్లో రూ.5,536 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. మరోసారి పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నుండి ఉగ్రవాద ముల్లును తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నేను గత రెండు రోజులుగా గుజరాత్లో ఉన్నాను. నిన్న వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్.. ఈరోజు గాంధీనగర్ను సందర్శించాను. నేను ఎక్కడికి వెళ్ళినా.. అది కాషాయ సముద్రం గర్జించే శబ్దంలాగా, దేశభక్తి తరంగంలా అనిపించింది. కాషాయ సముద్రం గర్జన, రెపరెపలాడే త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో మాతృభూమి పట్ల అపారమైన ప్రేమను చూపించింది. ఇది చూడటానికి మరపురాని దృశ్యమని అన్నారు. 1947 లో దేశం మూడు భాగాలుగా విభజించబడింది. ఆ రాత్రే కాశ్మీర్లో మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. మన దేశంలో కొంత భాగాన్ని ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదులను ఉపయోగించి పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది.
ఆ రోజున, మనకు పిఓకె వచ్చే వరకు మన సాయుధ దళాలు ఆగకూడదని సర్దార్ పటేల్ చెప్పినా.. ఎవరూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు మనం గత 75 సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం. పహల్గామ్ కూడా దానికి ఒక ఉదాహరణ. పాకిస్తాన్తో యుద్ధాలు జరిగినప్పుడు, మేము పాకిస్తాన్ను మూడుసార్లు ఓడించాం అని మోదీ చెప్పారు. ఒక శరీరం ఎంత బలంగా ఉన్నా, ఒక ముల్లు గుచ్చుకుంటే అంతా నొప్పిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్థాన్ మద్దతుతో దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదమే ఆ ముల్లు అని, దాన్ని తొలగించాల్సిన సమయం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. దేశ భద్రత, అభివృద్ధి, సంస్కృతి, జాతీయ గౌరవం గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని ప్రతి మూలలో దేశభక్తిని చూశానని, ఇది కేవలం గుజరాత్కు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రతి భారతీయుడి హృదయంలో ఉందని మోదీ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో రెండో రోజు వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలను సందర్శించిన తర్వాత మోదీ గాంధీనగర్లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
1947 విభజన తర్వాత మొదలైన ఉగ్రవాద దాడులను గుర్తు చేసిన ఆయన, ఆ రోజు ముజాహిదీన్ను అంతమొందించి, సర్దార్ పటేల్ సలహాను పాటించి ఉండి ఉంటే, ఈ 75 ఏళ్ల ఉగ్రవాద చక్రం మనకు కనిపించేది కాదన్నారు. పాకిస్థాన్ ఇప్పటికీ ఉగ్రవాదాన్ని ఒక పరోక్ష యుద్ధంగా వినియోగించుకుం టోందని, కానీ అది నిజానికి ఒక వ్యూహాత్మకమైన యుద్ధమేనన్నారు ప్రధాని మోదీ. ఇటీవలి కాలంలో జరిగిన భారత ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి కూడా ప్రధాని వివరించారు. 22 నిమిషాల్లో భారత్ 9 పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది కెమేరాల ముందే జరిగింది. ఇక రుజువుల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జెండాలు పెట్టి, వారికి సెల్యూట్ చేయడం ద్వారా, ఉగ్రవాదాన్ని తమ అధికారిక విధానంగా చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రధాని మోదీ, దేశ భద్రతపై మౌనంగా ఉండకుండా, ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
2014 మే 26న నేను ప్రధాని పదవిని స్వీకరించాను. అప్పటి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానం. కానీ ప్రస్తుతం అది నాలుగో స్థానానికి చేరిందని మోదీ గుర్తు చేశారు. ప్రపంచమంతా కరోనా, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సవాళ్లను ఎదుర్కుంటున్నప్పటికీ భారతదేశం తన గమ్యాన్ని వదులుకోలేదని ఆయన అన్నారు. మన లక్ష్యం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్. స్వాతంత్య్ర పొందిన 100 సంవత్సరాల సందర్భంగా, మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. శాంతియుత సహజీవనం భారత్ లక్ష్యమని, కానీ, ఆ శాంతిని సవాలు చేస్తే, భారతదేశం తక్షణమే స్పందిస్తుందని, ఇది వీరుల భూమి అని మోదీ వెల్లడించారు.