ఏడో గ్యారెంటీగా స్వేచ్ఛ అందించాం..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పరిపాలన
అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది.
రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా అధికారుల నియామకాలు
హోమ్‌ గార్డ్స్‌ డే సందర్భంగా వరాలజల్లు
దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000 పెంపు
హోంగార్డులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా
హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ప్రజాపాలన
విజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 :  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని, నేడు  తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.  హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  మాట్లాడారు. ఈసందర్భంగా  రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు  సీఎం రేవంత్‌ నివాళులర్పిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తిని రాష్ట్రంలో కొనసాగిస్తున్నామన్నారు. అంబేడ్కర్‌ సాక్షిగా తెలంగాణ ప్రజలకు  ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించా మన్నారు. . ఒకనాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి… కానీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగాయన్నారు. పోలీస్‌ శాఖలో దాదాపు15 వేల నియామక పత్రాలు అందించామని,  పీజీలు, పీహెచ్‌డిలు చదువుకున్నవారు కూడా పోలీస్‌ శాఖలో చేరి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వొస్తున్నారని సీఎం రేవంత్‌ తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్‌ ను నిరోధించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్‌ సరఫరా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

బీటెక్‌, ఎంటెక్‌ చదివిన వారికి సైబర్‌ క్రైమ్‌ లో డాటా అనాలసిస్‌ చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో సైబర్‌ క్రైమ్‌ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. సైబర్‌ క్రైమ్‌ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది.  తెలంగాణ లోకి డ్రగ్స్‌, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్‌ సిబ్బంది కృషి చేస్తున్నారు.. తెలంగాణ ప్రతిష్ట మసకబారొద్దు అంటే హైదరాబాద్‌ లాంటి మహానగరంలో డ్రగ్స్‌ , గంజాయి లాంటివి కనిపించొద్దు. స్కూల్స్‌, కాలేజీల్లో డ్రగ్స్‌ సంబంధిత వాటిని గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పోలీసులు యాజమాన్యాలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆలోచనలను వారికి వివరించండి. డ్రగ్స్‌ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్‌, కాలుష్యం హైదరాబాద్‌ నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ట్రాన్స్‌ జెండర్స్‌ పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు.

అందుకే ట్రాఫిక్‌ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్‌ ఇస్తున్నాం.. ఈ ప్రభుత్వం ట్రాన్స్‌ జెండర్స్‌ ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది…. ఐపీఎస్‌ అధికారి తీవ్రవాదుల దాడిలో మరణిస్తే రూ.2కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. డిసెంబర్‌ 6 హోంగార్డ్స్‌ రైజింగ్‌ డే…ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నామని,  హోమ్‌ గార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.  హోమ్‌ గార్డ్స్‌ వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం హోమ్‌ గార్డ్స్‌ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదవశాత్తు మరణం చెందినా రూ. 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  జనవరి నుంచి వీటన్నింటిని అమలు చేస్తాం.. శాంతిభద్రతలను కాపడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి.. అయినా పరిష్కారం కాకపోతే ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి.. ఆపై ఇంకేమైనా సమస్యలుంటే తాను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page