అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అవకాశాలిచ్చాం..
గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మాదిగ సామాజిక వర్గం సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలిపిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించింది. సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయింది.
కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. మీ వాదనలో బలం ఉంది.. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేసాం. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించాం.. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డాక్టర్ సంగీతని నియమించుకున్నామని తెలిపారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించామన్నారు.
ఐఐటీ వీసీగా, విద్యా కమిషన్ మెబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామని, పగిడిపాటి దేవయ్యని స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా నియమించుకున్నామని తెలిపారు. అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు.. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. అమలుచేయడంలో కొంత ఆలస్యం కావచ్చు… కానీ తప్పక న్యాయం చేస్తామని,. నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని, ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.