– ఒకరు ఏపీవాసి కాగా మరొకరు తెలంగాణ వాసి
– ఇద్దరు అమ్మాయిలూ బెంగుళూరులో ఉద్యోగం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి చనిపోయారు. వీరిద్దరూ బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.ధాత్రి ఇటీవల హైదరాబాద్లోని పెదనాన్న ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న ధాత్రి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి వాణి, బంధువులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ధాత్రి మృతికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన అనూషరెడ్డి దీపావళికి స్వగ్రామానికి వచ్చి గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరారు. ఖైరతాబాద్లో బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతిచెందారు. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. మరికొందరు మృతులను గుర్తించాల్సి ఉంది.
మంటలు గుర్తించి కిందకు దూకా: ప్రాణాలతో బయటపడ్డ ఆకాశ్
కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంతో పలువురు సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో కొందరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు ఆకాశ్.. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. తాను దీపావళికి హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు బస్సు ఎక్కినట్లు చెప్పారు. బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. హఠాత్తుగా లేచి చూడగా పెద్దఎత్తున మంటలు వచ్చాయి. వెంటనే బస్సు అద్దం పగలగొట్టి బయటకు దూకేశాను. నాతో పాటు బస్సులో నుంచి మరో ఇద్దరు బయటకు దూకారని ఆకాశ్ వివరించారు.
ఆచూకీ లేని తల్లీకొడుకు
పటాన్చెరు: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి బయలుదేరిన వారు ఇద్దరు ఉన్నారు. బెంగళూరుకు చెందిన తల్లీకుమారులు పిలోమి నాన్ బేబీ(64), కిషోర్ కుమార్(41) ఇటీవల దీపావళి పండగకు పటాన్చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలోని బంధువు, సాప్ట్వేర్ ఉద్యోగి రాము ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం పటాన్చెరు అంబేడ్కర్ కూడలి వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి బెంగళూరు బయలుదేరారు. అయితే ఈలోపే చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదానికి గురవడంతో వీరు క్షేమంగా ఉన్నారా లేదా అనేది తెలియడం లేదు. వారి ఆచూకీ కనుక్కునేందుకు రాము దంపతులు కర్నూలుకు బయలుదేరి వెళ్లారు.
బస్సులో మంటలు చెలరేగి దగ్ధం అవుతున్న సమయంలో ఓ యువకుడు సమయ స్ఫూర్తి ప్రదర్శించి ఆరుగరిని కాపాడాడు. హైదరా బాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొనడంతో చెలరేగిన మంటలు పలువురి ప్రాణాలను బలి తీసుకు న్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మొ త్తం 39మంది ప్రయాణికులు ఉన్నారు. మంటల్లో చిక్కుకుని 19మంది సజీవ దహనం కా గా మిగతా ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అద్దాలు పగలగొట్టి బస్సు నుంచి బయటపడిన కొందరు ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రయాణికుల్లో కొందరిని నవీన్ అనే వ్యక్తి తన కారులో హాస్పిటల్కి తరలించి మానవత్వం చాటుకున్నారు. క్షతగా త్రుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాలను ఆయన మీడియాకు తెలిపారు. హిందూపూర్ నుంచి నంద్యాలకు తాను వెళుతుండగా ఘటనా స్థలంలో బస్సు మంటల్లో దగ్ధమవుతూ కనిపించిందని చెప్పారు. బస్సులో నుంచి బయటపడ్డ ఆరుగురిని తన కారులో ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు తెలిపారు. బస్సు చుట్టూరా మంటలు వ్యాపించాయని, వాహనాన్ని సమీపించే అవకాశమే లేకుండా పోయిందని వాపోయారు. రమేశ్ అనే ఓ ప్యాసెంజర్ బస్సు అద్దం పగలగొట్టుకుని బయటకు వచ్చినట్టు అతడు తెలిపారు. అది మనిషి పట్టేంత వెడల్పు కూడా లేకపోవడంతో కొందరికి గాజు గుచ్చుకుని గాయాలయ్యాయని వెల్లడించారు. ఆరుగురూ క్షేమంగానే ఉన్నారని నవీన్ చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





