- దేశ సరిహద్దులు దాటుతుండగా పట్టివేత
– ఖాన్పై పలు కేసుల నమోదు
కోల్కతా, జూన్ 8: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలవరం సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సోమవారం తెల్లవారు జామున వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకుంది. దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ అధికారులు ఆయన ఆట కట్టించారు. జహంగీర్పై సౌత్ 24 పరగణాల జిల్లా ఫాల్తా పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద 7 క్రిమినల్ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటిలో ప్రధానంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, భూఅక్రమణలు, మహిళలను వేధించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తనపై నమోదైన వరుస కేసుల్లో పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని జహంగీర్ ఖాన్ గతంలో కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మే 18న కోర్టు ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించినప్పటికీ తాజాగా ఆ రక్షణను న్యాయస్థానం ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయనో, లేదా దీని వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందనే పిటిషనర్ వాదనల ఆధారంగా క్రిమినల్ కేసుల్లో రక్షణను పొడిగించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తన క్లయింట్పై కావాలనే వరుస కేసులు పెట్టారని, ఇదంతా రాజకీయ పగతో జరుగుతున్న వేధింపులని జహంగీర్ తరఫు సీనియర్ న్యాయవాది కిషోర్ దత్తా కోర్టులో వాదించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాజ్దీప్ మజుందార్ ఈ వాదనను గట్టిగా వ్యతిరేకించారు. మే 21న ఫాల్తా నియోజకవర్గంలో జరిగిన రీ-పోలింగ్లో ఖాన్ పాల్గొనేందుకు మాత్రమే గతంలో కోర్టు రక్షణ ఇచ్చిందని, మే 24న ఫలితాలు కూడా వచ్చినందున ఆ ప్రొటెక్షన్ను పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫాల్తా నియోజకవర్గ రీ-పోలింగ్ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇస్తూ జహంగీర్ ఖాన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఫాల్తా ప్రాంత ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ’నేను ఫాల్తా బిడ్డను.. ఇక్కడ ప్రశాంతత, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాను.. మన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్తా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నారు.. అందుకే నేను ఈ రీ-పోలింగ్ రేస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని జహంగీర్ ఖాన్ పేర్కొనడం గమనార్హం. బీజేపీ ప్రభుత్వం తమ నేతలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చిందని, పార్టీ కార్యాలయాలపై దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురిచేయడం వల్లే ఖాన్ ఎన్నికల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని నామినేషన్ ఉపసంహరణపై టీఎంసీ ఆరోపించింది. ఈ కీలక నేత నేపాల్ బోర్డర్లో ఎస్టీఎఫ్ చేతికి చిక్కడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జహంగీర్ ఖాన్ సరిహద్దు ప్రాంతం నుండి దేశం విడిచిపారిపోయేందుకు యత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సహా పలువురు టిఎంసి నేతలను పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. 2026 మార్చిలో బాంబు పేలుడులో పాత్ర ఉందనే ఆరోపణలపై గతవారం జాతీయ దర్యాప్తు సంస్థ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మూలాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





