రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

భారత సైన్యానికి యువత నైతికంగా మద్దతివ్వాలి
విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు..
ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పై డిప్యూటీ సీఎంతో కలిసి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7: రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్  అనంతర పరిస్థితులపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పూర్తిగా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలని, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు.

హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రతా పరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాలతోపాటు తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలన్నారు. కేంద్ర నిఘా బృందాలతో  రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాని, కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. భారత సైన్యానికి సంఘీభావంగా నేడు సాయంత్రం ఆరు గంటలకు సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చర్చించారు. ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని యువతనుకోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page