“ఐతే విచిత్రమేమిటంటే ఆ ముగ్గురు శిష్యులవీ మూడు భిన్న సిద్ధాంతాలు; మూడు విభిన్న దృక్పథాలు; మూడు వైవిధ్య జీవన విధానాలు… ఐనా ఆ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధిలేని కల్మష రాహిత్య ముత్యాల చెలిమీ, పగడాల మైత్రీ! దానికి కారణం ఆ గురుడి ఆలోచనా తరంగాల ప్రసరణ ప్రభావమంటే అతిశయోక్తి లేదు..”
(నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105 బాల్య విశేషాల గురించి మరొక్కసారి)
అదే సమయంలో రచనా వ్యాసంగంలో కూడా ఉత్సుకత ఉండటం వల్ల 1945 లో సదాశివరావు గారు వారం వారం ‘కాకతీయ సారస్వత సంకలనం’ పేరుతో నాలుగు పేజీల కరపత్రంలాంటి పత్రికను తీసేవారు. ఇందులో వీరికి అడవాల సత్యనారాయణ రావు గారి తోడ్పాటు ఉండేది . ఆ సంకలనాలలో పీవీ పలు రచనలు చేశాడు. పీవీ రాసిన ‘మానాప మానాలు’ అనే నవల కూడా అందులో ముద్రింపబడింది. ఆ విధంగా పీవీ రచనలు మొదటి సారిగా ముద్రింప బడటం జరిగింది. ఒక ‘గురువు’ – ‘లఘువులు’ కాని శిష్యులు ముగ్గురు ఆరడుగుల బక్క పలచని విగ్రహం బట్ట తల, గాంధీ మీసాలు, ముతక ఖద్దరు ధోతీ, లాల్చీ – ఇదీ గార్లపాటి రాఘవరెడ్డి గారి ఆకార విశేషాలు.
ఆయన వరంగల్ లోని మహబూబియా ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి 1962 లో రిటైర్ అయ్యారు. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత భాషల్లో పాండిత్యము కలిగిన ఆయన గొప్ప తాత్త్విక కవి. అహంకార రహిత సహజ సామాన్యత పరిఢవిల్లిన ఆత్మనివేదనను వేణుగోపాలకుడికి ఛందోమయంగా అతి మనోహరంగా నివేదించిన ఆయన ‘పరిదేవనము ‘ ఒక గొప్ప శతక కావ్యము. వీరి ఇతర రచనలు సావిత్రి (ఖండ కావ్యం), రతి విలాపం (ఖండ కావ్యం), గోపికా వల్లభ (అసంపూర్ణ శతకము). ఆను నిత్యం సత్యాన్వేషణ తప్ప యేమాత్రం కీర్తి కండూతి, ప్రచార పటాటోపం లేని ఆయన రచనలు, కావ్యాలు అముద్రితాలుగానే మిగిలిపోయాయి. అలనాటి కాకతీయ పత్రికలో (1947 -1956) ఆయన అనేక రచనలు ప్రచురిత మయ్యాయి.
కానీ పుస్తక రూపాన ప్రచురితం కాకపోవడం చింతించ వలసిన విషయం. ప్రఖ్యాత హిందీ కవయిత్రి ‘మహా దేవి వర్మ ‘ ప్రభావం ఆయనపై ఎంతైనా వుంది. పీవీ కి మహా దేవి వర్మ కవితలపై ఆసక్తి కలిగించిన వారిద్దరు. ఒకరు గార్లపాటి రాఘవరెడ్డి గారైతే మరొకరు కాళోజీ రామేశ్వరరావు గారు. వీరు కాళోజీ నారాయణ రావు గారికి అన్నగారు మరియు ప్రఖ్యాత ఉర్దూ కవి. ఈ పెద కాళోజీ గారు ‘షాద్ కవి ‘ గా పేర్గాంచినారు. ఇక రాఘవరెడ్డిగారు నిరాడంబరంగా ఆర్య సమాజ ‘ఆశ్రమం లో తన జీవనం గడిపి 1966 లో పరమపదించారు. ఆయన కవిత్వపు గొప్పదనం గురించి ఈ క్రింది దృష్టాంతం తెలియజేస్తుంది: శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి అప్పటి తరాని కందరికీ, నేటి యువ జనానికి కొందరికీ తెలుసు.
“కవి సా మ్రాట్”గా పేరు గాంచిన ఆ మహాకవి ఎన్నో రచనలను (గద్య – పద్య విభాగాలలో) చేసి విశ్వ ప్రఖ్యాత కవిగా, రచయితగా పేరొందారు. ఆయన రచనలన్నీ అమోఘ రత్నాలైనా రెండింటి గురించి చెప్పడం ఆయనకు నివాళి అర్పించడానికే! ఒకటి- నవలా రచనలకే వన్నె తెచ్చిన “వేయి పడగలు”. దీనినే పీవీ గారు ‘సహస్ర ఫణ్’ అని హిందీ భాషలోకి అనువదించారు. ఇక రెండవది తెలుగు సాహిత్య రంగానికే రంగులద్ది వెలుగులు పూయించిన- వారు రాసిన “రామాయణ కల్ప వృక్షం” ఇంతటి ప్రఖ్యాత కవి యేదో సందర్భంలో (1945 ప్రాంతాల్లో) వరంగల్ కు వచ్చారు.
ఆ రోజుల్లో వరంగల్ కు సాహిత్య సాంస్కృతిక రంగాల పెద్దలెవరు వచ్చినా వారు బస చేసేది కాళోజీ గారింట్లోనే కదా! ఆ సాయంకాలం విశ్వనాధా, కాళోజీ బయట పని ముగించుకొని ఇంటికి వచ్చారు. విశ్వనాధ మంచం మీద సేద తీరడానికా అన్నట్లు నడుము వాల్చారు. పక్కనే కుర్చీలో కూర్చున్న కాళోజీ ‘మా గురువు గారు కూడా ఒక మంచి కవే! మీరు సరే అంటే వారిని మీకు పరిచయం చేస్తాను’ అని అన్నారు. ‘సరే!’ అని ఒప్పుకున్నారు విశ్వనాధ. వెంటనే కాళోజీ తనే స్వయంగా బయల్దేరి వెళ్ళి గార్లపాటి రాఘవరెడ్డి గారిని తనతో పాటు తీసుకొని వచ్చి విశ్వనాధ వారికి పరిచయం చేసి పక్కనే ఒక చాప వేసుకొని ఇద్దరూ కూర్చున్నారు.
మంచం మీద ఒక పక్కకు ఒరిగి పడుకున్న విశ్వనాధవారు రాఘవరెడ్డి గారి రచనల గురించి చెప్పమన్నారు. రాఘవరెడ్డి గారు తమ ‘పరిదేవనము’ కావ్యం నుండి ఒక పద్యం చదివారు. ఆ పద్యం వింటూనే నడుము వాల్చిన విశ్వనాధవారు దిగ్గున లేచి కూర్చున్నారు. మరో పద్యం చదివే సరికి మంచం దిగి చాప మీదికి చేరారు. మూడో పద్యం చదివే సరికి కండ్లలో నీళ్ళు (ఆనంద భాష్పాలు) తెచ్చుకొని గార్లపాటి వారిని కౌగలించుకొని ‘అద్భుతం! ఇక్కడ (అంటే అలనాటి హైదరాబాద్ రాష్ట్రంలో అని ఉద్దేశం) ఇంత మంచి కవులున్నారా!’ అని ప్రశంసలు కురిపించారు. ఇంతకంటే గార్లపాటి గారి గురించి ఎక్కువగా ఏం చెప్పగలం?
ఐతే ఇంతటి గొప్ప పండితుడిని ‘గురువు’గా కలిగిన అ ముగ్గురు ప్రియ శిష్యుల గురించి పేర్కొంటే రాఘవరెడ్డి గారి పాండిత్య ప్రతిభ యేమిటో మనకు తెలుస్తుంది. ఆ ముగ్గురూ మహా మహులే! లబ్ధ ప్రతిష్టులే!! తమ తమ రంగాలలో పేరెన్నిక గల వారే!!! మొదటి వారు – ఆయనకు అత్యంత ప్రియ శిష్యుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు. ఫ్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల బాధల కన్నీటి గుర్తులను తన గొడవలుగా వినిపించి అన్యాయాన్ని ఎదిరించిన ‘కన్నీటి కవి’. రెండవ వారు – మహా మేధావి, సాహిత్య దురంధరుడు, రాజకీయ చాణక్యుడు, పూర్వ ప్రధాన మంత్రి – శ్రీ పీ వీ నరసింహా రావు గారు. ఇక మూడవ వారు – ప్రఖ్యాత మార్క్సిస్టు తత్త్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి సదాశివరావు గారు. “లఘువులు” కాని ఇంతటి విశిష్ఠ శిష్యులను కలిగిన ఆ ‘రాఘవుడు’ నిజమైన గురువుకు నిర్వచనం!
ఐతే విచిత్రమేమిటంటే ఆ ముగ్గురు శిష్యులవీ మూడు భిన్న సిద్ధాంతాలు; మూడు విభిన్న దృక్పథాలు; మూడు వైవిధ్య జీవన విధానాలు… ఐనా ఆ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధిలేని కల్మష రాహిత్య ముత్యాల చెలిమీ, పగడాల మైత్రీ! దానికి కారణం ఆ గురుడి ఆలోచనా తరంగాల ప్రసరణ ప్రభావమంటే అతిశయోక్తి లేదు.. పీవీ గారు రాసిన ‘ఇన్ సైడర్ ‘ గ్రంథం ముందు మాటలో గార్లపాటి రాఘవరెడ్డి గారి పేరు, పాములపర్తి సదాశివరావు గారి పేరు పేర్కొనడం జరిగింది. పీ వీ సాహిత్యావలోకనం, భావ ప్రకటనలను ఇనుమడింప జేసిన గురు రాఘవుడు 1945లో పీవీ మొదటిసారిగా గార్లపాటి రాఘవరెడ్డి గారిని కలిసారు. ప్రఖ్యాత ఆంగ్ల కవి ‘థామస్ గ్రే’ రాసిన కవిత్వం ‘ఎలిజీ‘ని పీవీ తెలుగు లోకి అనువాదం చేశాడు.
దాన్ని మిత్రుడు సదాశివుడికి వినిపింపగా గార్లపాటి రాఘవరెడ్డి గారు అదివరకే దానిని తెలుగులోకి అనువదించారని మిత్రుడు చెప్పగా ఇద్దరూ కలసి రాఘవరెడ్ది గారుండే ఆశ్రమానికి పోయి ఆయన్ను కలిసారు. ఆ విధంగా రాఘవరెడ్డి గారితో పరిచయం జరిగింది. రెడ్డి గారూ, పీవీ ఇద్దరూ తమ అనువాదాలను పరస్పరం చదివి వినిపించుకున్నారు. ఈ పరిచయం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగి పీవీ రాఘవరెడ్డి గారి శిష్యుడయ్యాడు.
(ముగింపు రేపటి సంచికలో )
పాములపర్తి నిరంజన్ రావు
పిన్నా శివకుమార్





