- ప్రజలను మభ్య పెట్టే యత్నంలో కెసిఆర్
- కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : బిఆర్ఎస్ వజ్రోత్సవ సభవల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మళ్లీ అధికారంలోకి వొస్తామని, గెలుస్తామని ప్రకటించడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం తప్ప మరోటి లేదన్నారు. కేవలం మభ్య పెట్టే యత్నాల్లో కెసిఆర్ ఉన్నారని విమర్శించారు. బిఆర్ఎస్ తన పాలనలో ఆ పార్టీ ఏం చేసిందో, ఏం చేయలేదో చెప్పుకోలేక పోయిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకే ఏ చేయలేని ముఖ్యమంత్రి దేశానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కాకపోతే.. అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి, బీజేపీను విమర్శించడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వజ్రోత్సవ సభ నిర్వహించిందని సంజయ్ విమర్శించారు.
9ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేయబోతుందో చెప్పకుండా బీజేపీ లక్ష్యంగానే సమావేశాలు నడిచాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం మరింత ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. ఆ తీర్మానాల వల్ల రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. మోదీ పాలనలో దేశ ఆర్ధిక వ్యవస్థపై విమర్శలు చేసిన కేసీయార్ తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను అప్పులపాలు చేసిందినిజం కాదా అని ప్రశ్నించారు. మోదీ విధానాల్ని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ, సహారా కుంభకోణాలు వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. భాజపా మతతత్వ పార్టీ అన్న కేసీఆర్ విమర్శలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
దేశానికే ఎంఐఎం పార్టీ క్యాన్సర్ లాంటిదని, అలాంటి క్యాన్సర్ గొంతులో వేసుకున్నది కెసిర్ అని ఎదురుదాడికి దిగారు. ఎంఐఎం మత పార్టీ కాదా అని ప్రశ్నించారు. అవకాశమిస్తే కేసీఆర్ ముస్లింలకు 20శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్- తెరాస ఒకటేనన్న సంజయ్.. కాదని చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. బీజేపీను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీయేతర పక్షాలు ఒక్కటవుతున్నాయని, ఎన్ని కూటములు ఏర్పడినా..తెలంగాణలో తదుపరి బీజేపీదే అధికారమని స్పష్టం చేశారు. మహిళా గవర్నర్కు రాష్ట్రంలో కనీస గౌరవం దక్కడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆయా గ్రామాలు అభివృద్ధి చెందాయని, అవార్డులు పొందాయని గుర్తు చేశారు. లక్షల కోట్ల అప్పులున్న తెలంగాణ ధనిక రాష్ట్రమా. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం సంపాదించుకుందని బండి సంజయ్ విమర్శించారు.