- ఒప్పందాలు లేకుండా చర్చలు ఉండాలి
- ప్రతి ఒక్కరికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది
- శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్
- మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు
హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చల ఆవశ్యకతపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధ్యులు డాక్టర్ తిరుపతయ్య ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యా, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘటించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య అధ్యక్షత వహించిన ఈ సదస్సులో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా, రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ప్రజలకు కల్తి లేని ఆహారం, నీరు, గాలి దొరికే పరిస్థితి లేదన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులను కల్పించిందని, ఆ హక్కుల ప్రకారం వారు స్వయంపాలన అధికారం కలిగి ఉంటారని అన్నారు. అటువంటి గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ పని చేపట్టదలిచినా వారి నిర్ణయానికి వ్యతిరేకంగా చేసే అధికారం లేదన్నారు. అయినప్పటికీ వాటిని స్వయంగా ప్రభుత్వమే ఉల్లంఘిస్తూ ఆదివాసుల హక్కులకు విఘాతం కలిగించడం ప్రజాస్వామ్యబద్దం కాదన్నారు. రాజ్యాంగం ప్రజలందరికీ గౌరవ ప్రదమైన జీవించే హక్కును వాగ్దానం చేసింది. అది ఆదివాసులకు, మావోయిస్టులకు, పోలీస్ వారికీ అందరికీ వర్తిస్తుంది. మేం శాంతి చర్చల కమిటీగా ఏర్పడి మావోయిస్టులకూ, కేంద్ర ప్రభుత్వానికీ హింసను విడనాడాలని విజ్ఞప్తి చేశాం.
మావోయిస్టులు ఒక వారం వ్యవధిలో స్పందించి, మా వైపు నుంచి తుపాకులు వినియోగించమని, చర్చల ద్వారా శాంతి ఏర్పడటానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మేము తుపాకులు వాడం, చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించి, నెల రోజుల నుంచి వారు దానికి కట్టుబడి ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వారిని చుట్టుముట్టి చంపేయటానికి మరిన్ని బలగాలను పంపటం ఏ రకంగానూ ధర్మం కాదన్నారు. అది రాజ్యాంగ ధర్మం కాదు, నైతిక ధర్మం కాదు, ఆధ్యాత్మిక ధర్మం కూడా కాదన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, బేషరతుగా మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. చర్చల సమయంలో మీరు ఏ రకమైన షరతులైనా పెట్టండి, కానీ చర్చలకు ముందు షరతులు పెట్టడం భావ్యం కాదన్నారు. వెంటనే కర్రెగుట్టలలో ఛత్తీస్ గడ్ లో మోహరించిన బలగాలను మావోయిస్టులను చంపటానికి పంపకూడదని, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని అందుకోసం ప్రజలు ప్రజాస్వామికవాదులు తమ గొంతును విప్పాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటి రాజకీయ వైఖరులకు అతీతంగా ఈ సమస్యను శాంతియుతంగా మానవీయ మార్గంలో పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేయాలని అన్నారు.
సదస్సులో ఈ అంశాలనే తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టారు. సదస్సులో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశిని కోటి, మొలుగురు సదయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పింగళి రమేష్, తక్కలపల్లి రాజేశ్వరరావు, పొడేటి రామస్వామి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, సిపిఐ ఎం నాయకులు వాసుదేవరెడ్డి, మానవ హక్కుల వేదిక నాయకులు బదావత్ రాజు, టి హరికృష్ణ, పందిళ్ళ రంజిత్ కుమార్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటి సామ్రాజ్యం, మోహన్, బిఎస్పి నాయకులు దొడ్డే సమ్మయ్య, డిటిఎఫ్ నాయకులు ఆవాల నరహరి, విద్యావేత్త పుల్లూరు సంపత్ రావు, విద్యార్థి సంఘ నాయకులు సజ్జు, ఇమ్రాన్ ఆవాల హరిబాబు, శిరీష , స్రవంతి తదితరులు మాట్లాడారు. సదస్సుకు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు.