ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యమైంది..
న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలి
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులివ్వాలి
టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని పిలుపు
జూన్ 2వ తేదీ లోపు కమిటీని ప్రకటించాలి
లేనిపక్షంలో భిక్షాటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటాం
హెచ్చరించిన తెలంగాణ ఉద్యోమకారుడు గొల్లపల్లి నాగరాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం న్యాయమైన డిమాండేనని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల కార్యాచరణ సమావేశం రామగిరి ప్రకాష్, గొల్లపల్లి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ వుమెన్(పివొడబ్లు) సంధ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సమన్వయ కమిటీ పెట్టిన డిమాండ్లు న్యాయమైనవేనని అన్నారు.
ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని స్వరాష్ట్ర సాధనకు కారణమైన ఉద్యమకారుల న్యాయమైన కోరికలను పరిష్కరించాల్సిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ఒక్కరితో తెలంగాణ రాలేదని, ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని అన్నారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వెంకన్న, ముత్తయ్య యాదవ్, బండి వెంకటేష్, లాలయ్య, బీరకాయల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన గొల్లపల్లి నాగరాజు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ లోపు కమిటీ ప్రకటించాలన్నారు. లేని పక్షంలో భిక్షాటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటామని హెచ్చరించారు.