హస్తినలో గుభాళించిన తెలంగాణ సంస్కృతి

చేనేత కళాకారుల ప్రతిభను ప్రశంసించిన రాష్ట్రపతి
˜అందరినీ ఆకట్టుకున్న ‘‘గుస్సాడి’’ నృత్యం
˜నేటి నుంచి దిల్లీలో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’
˜తెలంగాణకు ప్రత్యేకంగా పెవిలియన్‌ ఏర్పాటు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 5 : రాష్ట్రపతి భవన్లో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌, ఉప ముఖ్య మంత్రి. బుధవారం భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము’’ ముఖ్య అతిథిగా రాష్ట్రపతి భవన్‌ లోని అమృత్‌ ఉద్యాన్‌ లో ఏర్పాటు చేసిన ‘‘వివిధతా కా అమృత్‌ ఉత్సవ్‌’’ ప్రారంభం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రధాన కార్యక్రమానికి ముందు రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల స్టాళ్లను సందర్శించారు. కాగా తెలంగాణ పెవిలియన్‌కు విచ్చేసిన రాష్ట్రపతిని గవర్నర్‌, ఉప ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని,చేతివృత్తుల ప్రాముఖ్యతను స్వయంగా వారికి వివరించారు. అగ్గిపెట్టెలో పట్టే విధంగా చేతితో చీర నేసిన సిరిసిల్ల నేతకారుల పనితీరును రాష్ట్రపతి ప్రముఖంగా ప్రశంసించి, నేసే విధానాన్ని అడిగి తెలుసు కున్నారు.

అనంతరం ఉపముఖ్యమంత్రి స్టాళ్ళన్నింటినీ కలియ తరిగి వాటి నిర్వాహకులతో ముచ్చటించారు. ప్రధాన కార్యక్రమం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రదర్శించిన ‘‘గుస్సాడి’’ నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది.నేటి ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి అన్ని దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లు,సంబంధిత మంత్రులు హాజరయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’లో భాగంగా గత సంవత్సరం నుంచి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధతకా అమృత్‌ ఉత్సవాలను జరుపుతున్నారు. భారతదేశంలోని సాంస్కృతిక, భాషా, సంప్రదాయ వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ ‘‘భిన్నత్వం లో ఏకత్వం’’ అనే స్ఫూర్తిని చాటి చెప్పటమే ఈ కార్యక్రమ లక్ష్యం. గురువారం జరగనున్న ఉత్సవాల్లో అన్ని దక్షిణ భారత భారత రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. అందరికీ ఉచితం గా ప్రవేశ సదుపాయం కల్పించారు .

నోరూరించనున్న తెలంగాణ రుచులు
ఈనెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌ లతో సహా 20 మంది వివిధ ప్రాంతాల ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది హస్తకళా నిపుణులచే స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అంతే కాకుండా ముగ్గురు హస్తకళా నిపుణులు స్వయంగా ఆయా వస్తువుల తయారీ పద్ధతిని అతిథులకు చూపించనున్నారు.అదే విధంగా అతిథులకు నోరురించే విధంగా తెలంగాణ రుచులతో కూడిన ఫుడ్‌ స్టాల్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అతిథులను అలరించడానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ కళా రూపాలైన ఒగ్గు డోలు,పేరిణి, గుస్సాడీ ప్రదర్శనలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page