గృహ వసతి కల్పనలో దేశానికే తలమానికం

ఇప్పటివరకు 3 లక్షల ఇండ్ల మంజూరు
రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వంకూడా రూ.5లక్షల తో ఇండ్లను నిర్మించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని వెల్లడిరచారు. పేదవాడికి మరింత చేయూత ఇవ్వాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కో ఇంటికి 40 మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లపై ఆయన అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గుడిసెలు అనేవి లేకుండా చేయాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లను మంజూరు చేశామని, ఇందులో లక్షా 23 వేల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లుల కోసం లబ్దిదారులు ఎదురు చూడాల్సిన పరిస్దితి లేకుండా ప్రతి సోమవారం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నిధులను జమచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడిరచారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంలో కొన్ని జిల్లాల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కివచ్చిన నేపధ్యంలో పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఇందుకు అవసరమైన అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page