సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

కంచ గచ్చిబౌలిలో విధ్వంసం ఎంత భయంకరమైందో తేలింది..
మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  బాధ్యత గల ప్రభుత్వం, కావాలనే సెలవు దినాల్లో బుల్‌డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు.

అని వ్యాఖ్యానించారు. విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామమని, కంచె గచ్చిబౌలి భూములను, పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన రిపోర్టుతో కళ్లు తెరిపించిందన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వొస్తాయని గతంలోనూ అనేక సార్లు నిరూపనైంది.

ఈరోజు కూడా అదే జరిగిందని అన్నారు. విధ్వంసమే విధానంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన కొనసాగుతోందని, నాడు హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చి అరాచకం చేశారని,  నేడు బుల్‌డోజర్లతో పర్యావరణ హననం చేశారని అన్నారు. మాకు న్యాయస్థానాల మీద ఎంతో గౌరవం ఉందని, అందుకే బాధ్యతగా బిఆర్ఎస్ పార్టీ తరఫున సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చాం. ఆధారాలతో సహా వాస్తవాలు వివరించామని తెలిపారు. వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page