– కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు
– ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్
– రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు కమిషనర్ వివరణ
కరీంనగర్, ప్రజాతంత్ర, మే 14: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని చెప్పారు. తన కార్యాలయంలో గౌస్ ఆలం విలేకరులతో మాట్లాడుతూ ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తం 161.4 తులాల బంగారు ఆభరణాలను ఈ గ్యాంగ్ దోపిడీ చేసిందని, వీటి విలువ రూ.82 లక్షలు ఉంటుందని తెలిపారు. బిహార్కు చెందిన సుభోద్ గ్యాంగ్కి గోల్డెన్ తీఫ్గా పేరుందని గుర్తు చేశారు. ఈ గ్యాంగ్ పీఎంజే జ్యువెలరీ షాపులో ముందుగా రెక్కీ నిర్వహించి ఈ దోపిడీ చేసిందన్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని మెహతాబ్ వద్ద ఈ ముఠా సెల్ ఫోన్, సిమ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్లలో బంగారం షాపులపై ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని చెప్పారు. ప్రధాన నిందితుడు జాగీరా సింగ్ సహా ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్లను అరెస్టు చేశామని సీపీ తెలిపారు. వీరు నకిలీ ఆధార్, నకిలీ బైక్ నెంబర్లు, నకిలీ పేర్లతో తిరుగుతూ ఈ దోపిడీలకు పాల్పడతారన్నారు. రెండు నెలల ముందు ఈ గ్యాంగ్ తెలంగాణకు వచ్చిందని సీపీ తెలిపారు. ముగ్గురు నిందితులను కమిషనర్ గౌస్ ఆలం విÖడియాకు చూపించారు. ఈ కేసులో పోలీసులు 12 రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించారు. దోపిడీ తర్వాత రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు ప్రయత్నించారని, దోపిడీకి రెండు నెలల క్రితమే రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్పై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని, బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్లలో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడిందని తెలిపారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు. పిస్టల్స్తో వచ్చిన ఐదుగురు దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపి కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లిన విషయం విదితమే. దొంగల కాల్పుల్లో షాపు సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతోపాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ తీవ్రంగా గాయపడ్డారు. షాపులోకి వచ్చిన ఐదు నిమిషాల్లోనే పని ముగించుకున్న దొంగలు పల్సర్, అపాచీ బైక్లపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు పది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎంపీ బండి సంజయ్ ఆఫీస్, జిల్లా జడ్జి ఇంటికి సవిÖపంలోనే సినీ ఫక్కీలో భారీ చోరీ జరగడంతో తీవ్ర కలకలం రేగింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





