11వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం..
నిర్వీర్యమైన యూనివర్సిటీల బలోపేతానికి చర్యలు
యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొస్తున్నాం..
రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్
గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వంటి వారిని ఈ పాఠశాల మనకు అందించిందని, ఎంతో మంది మేధావులను అందించిన చరిత్ర ఈ పాఠశాలకు దక్కుతుందని తెలిపారు. మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. 150 సంవత్సరాల ఈ పాఠశాల గొప్పతనాన్ని వివరించారు. . ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి భావితరాలకు ఒక చరిత్రగా అందించాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేశామని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 11,000 మంది ఉపాధ్యాయులను నియమించి పాఠశాలలను బలోపేతం చేశామని, 31వేల మంది ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామని చెప్పారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలను పెంచామని, పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. వైస్ ఛాన్స్లర్స్ ను నియమించి యూనివర్సిటీలను బలోపేతం చేసుకున్నాం.
ప్రొఫెసర్ల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు వారి రిటైర్మెంట్ వయసును 65 కు పెంచాం. బడ్జెట్ లో 7 శాతం నిధులను విద్య కోసం కేటాయించాం. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే.. అందుకే విద్య కోసం బడ్జెట్ ని 7 శాతం నుంచి దశలవారీగా 15 శాతం వరకు పెంచుకుంటూ వెళతాం. సాంకేతిక నైపుణ్యం పెంచి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. క్రీడల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించికోబోతున్నాం. హైదరాబాద్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించి పాఠశాలల ప్రతిష్ట పెంపొందించాలి. లోపాలను సవరించుకుని విద్యా ప్రమాణాలు పెంచుకుందామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మొగిలిగిద్ద పాఠశాలకు భారీగా నిధులు
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల, గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేశారు. మొగిలిగిద్ద గ్రానానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేశారు. గ్రామంలో పాఠశాల నూతన భవనం, గ్రంధాలయ భవన నిర్మాణాల కోసం రూ.10 కోట్లు కేటాయించారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాల కోసం (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద రూ.5 కోట్లు మంజూరు. చేశారు. అలాగే మొగిలిగిద్ద గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.50 లక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 లక్షల నిధులు కేటాయించారు.