– మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపాలి
– అజారుద్దీన్కు పదవి కేవలం మైనార్టీలను దువ్వడమే
– ఎన్నికల అధికారికి బిజెపి నేతల ఫిర్యాదు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30: జూబ్లీహిల్స్ వోటర్లను ప్రభావితం చేసేలా చేస్తున్న మంత్రివర్గ విస్తరణను ఆపాలని బిజెపి ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇది కేవలం ఓ వర్గం వారిని మచ్చిక చేసుకునే చర్య తప్ప మరోటి కాదని పేర్కొంది. ఓ వర్గం వోట్ల కోసమే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్లో పోటీ చేశారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణను ఆపాలని సీఈవోను కోరారు. తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డిని కలిశారు. మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల నిర్ణయించారు. ఈ నెల 31న విస్తరణకు అవకాశం ఉందని, అజారుద్దీన్కు ఏఐసీసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు జరగవచ్చని కూడా తెలుస్తోంది. ఈక్రమంలో సీఈవోను బీజేపీ నేతలు కలిసి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఒక వర్గం వోట్లు ప్రభావితం అవుతాయ న్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ‘మంత్రివర్గ విస్తరణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని అంటూ పాయల్ శంకర్ అన్నారు. ఒకవేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే ఎన్నిక తర్వాత ఇవ్వాలి. కానీ ఉన్నఫళంగా మంత్రివర్గ విస్తరణ చేయడం, అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మర్రి శషిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల లబ్ది కోసం ఒక వర్గం ఓట్లు కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ వర్గంపై ప్రేమ ఉంటే గతంలో ఎందుకు ఇవ్వలేదు. మంత్రి పదవి ఆశ చూపి ఆ వర్గాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోడ్ ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవాలంటూ కోరాం. సినీ కార్మికులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేయడంకోడ్ ఉల్లంఘనే అవుతుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





