పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే అందుకు ప్రతీకార చర్య తీసుకుంటామన్నట్లుగానే వారం రోజుల వ్యవధిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నమాట నిలుపుకున్నారు. అందుకు మంగళవారం అర్థరాత్రి ముహుర్తాన్ని నిశ్చయించి విజయవంతంగా లక్ష్యాన్ని ముద్దాడారు. దీనితో యావత్ భారతదేశం హర్షం వ్యక్తంచేస్తున్నది. ప్రధానంగా సైన్యం తీసుకున్న చర్యలకు జయజయ నినాదాలు చేస్తున్నారు. అయితే అంతటితోనే సంతృప్తి పడకుండా కార్యాచరణను ముందుకు తీసుకుపోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని, సైనికాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకముందు పాక్ ఆక్రమిత (పిఓకె) కాశ్మీర్ అన్నది ఉండవొద్దని వారు కోరుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ Operation Sindoor ఆపరేషన్కు ‘సింధూర్’గా నామకరణం చేయడంలోనే విజయం దాగి ఉన్నదన్న భావన సర్వత్రా వినిపిస్తున్నది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే ఈ నామకరణం చేసినట్లు తెలుస్తున్నది.
భారత సంస్కృతి సాంప్రదాయాల్లో సింధూర్ను అత్యంత పవిత్రంగా భావిస్తారు. సింధూరం ధరించే మహిళలను పుణ్యస్త్రీలు గా భావిస్తారు. వివాహ శుభ సందర్భంలో సింధూర ధారణను ప్రత్యేక తంతుగా జరుపుకుంటారు. తలజుట్టు మధ్యపాపడిలో సింధూరాన్ని వివాహ స్త్రీలు ధరించడమన్నది సంప్రదాయంగా వొస్తున్నది. అలాంటి సింధూరానికి ఉగ్రవాద ముష్కరులు కొందరు మహిళలను దూరం చేసిన ఘటన ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగింది. వారం రోజుల క్రితం వివాహమై, హానిమూన్కోసం కశ్మీర్కు వొచ్చిన నవ వధువుల కుంకుమను చెరిపేసి ఆ కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించారు ముష్కరులు. సరిగ్గా వారం రోజుల కింద వివాహమైన వినయ్ నర్వాల్, హిమాన్ష్ వినయ్లు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న సమయంలో ఉగ్రదాడి జరిగింది. వినయ్ అక్కడికక్కడే కుప్పకూలడంతో, రోదిస్తూ ఆయన మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూర్చున హిమాన్ష్ చిత్రం కేవలం భారతదేశమే కాదు, యావత్ ప్రపంచాన్నే కలిచివేసింది.
అలాంటి ఘటనే మరో నూతన జంటకు ఎదురైంది. శుభం ద్వివేదీ, ఐశాన్య ద్వివేది జంటను వేరు చేశారు. ఆయన మతమేంటో తెలుసుకుని మరీ చంపేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఏ మహిళల సింధూరాన్ని అయితే ఉగ్రవాదులు చెరిపేశారో, ఆ ఉగ్రవాదులను తుదముట్టించే, ప్రతీకారంగా నిర్వహించే సైనిక చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’గా నామకరణచేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలతోపాటు పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేర క్షిపణులతో దాడిచేసి వాటిని నేలమట్టం చేసింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను, సుమారు వందమంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు తెలుస్తున్నది. ఇందులో ఉగ్ర సంస్థలకు చెందిన ఆగ్రనాయకులు మృతి చెందినట్లు వార్తలు వొస్తున్నాయి. అయితే వారెవరు, ఎంతమంది అన్న విషయాలు ఇంకా తెలువాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోదీ అన్నట్లుగానే దాడి ఎప్పుడు, ఎలా చేస్తామన్నది కనీసం పాకిస్తాన్ ఊహించని విధంగా జరుగుతుందన్నట్లుగా, పాకిస్తాన్లో అడుగుపెట్టకుండా, ఆ దేశ రాడార్లు గుర్తించ లేనివిధంగా లక్ష్యాన్ని చేదించడమన్నది భారత్ సైన్యం సాధించిన గొప్ప విజయం.
దీంతో ఒక విధంగా పహల్గాం దాడికి ధీటైన జవాబిచ్చినట్లు అయింది. భారతమాత నుదుట సింధూరాన్ని తీర్చిదిద్దినట్లైంది. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న భారత ప్రజలకు ఈ దాడి స్వాంతన చేకూర్చినట్లు అయింది. పహల్గాం మృతుల కుటుంబాలకు కొంతైనా న్యాయం చేసినట్లు అయింది. మంగళవారం ఆర్థరాత్రి కేవలం 23 నిమిషాల్లో ఈ ఆపరేషన్ను పూర్తిచేసింది భారత సైన్యం. దశాబ్దాలుగా పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత్ మరోసారి తన సత్తాను చాటిచెప్పింది. ఇప్పటికైన పాక్ బుద్ది తెచ్చుకుని ఉగ్రవాదానికి స్వస్తి పలకాలి. పాక్ ఒక దాడిచేస్తే, భారత్ రెట్టింపుదాడి చేస్తుందని మోదీ సర్కార్ జవాబిచ్చినట్లు అయిందంటున్నారు. మరో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఇంత పెద్ద యుద్ద వాతావరణానికి సంబంధించిన వార్తను సహజంగా ప్రధాని లేదా హోంశాఖ మంత్రి లేదా మిలటరీ అత్యున్నత అధికారులు కాకుండా సైన్యానికి చెందిన మహిళ అధికారులు ప్రజలకు తెలియజేయడం. Colonel Sophia Qureshi కల్నల్ సోఫియా ఖురేషీ, Wing Commander Vyomika Singh వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు దాడి జరిగిన వివరాలను మీడియా సమావేశంలో ప్రజలకు తెలియజేశారు. అంటే భారత మహిళలు అపరకాళిలుగా ఎలా విజృంభిస్తారన్న మరో మెసేజ్ను పాకిస్తాన్కు తెలియజేసినట్లయింది.