– మరోమారు నోటీసులు జారీ
– ఫామ్హౌజ్ విచారణ కుదరదని స్పష్టీకరణ
– నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి
– న్యాయనిపుణులతో చర్చించి నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కాకుండా హైదరాబాద్లోనే కేసీఆర్ను విచారించాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ‘సిట్’ అధికారులు కేసీఆర్కు గురువారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం విచారణను వాయిదా వేయాలని కోరారు. మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని, విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలని సూచించారు. అలాగే భవిష్యత్ లో ఎలాంటి నోటీసులైనా ఎర్రవల్లి ఫామ్ హౌస్ అడ్రస్ కే పంపాలని విన్నవించారు. కేసీఆర్ వినతిపై న్యాయనిపుణులతో చర్చించిన ‘సిట్’ ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3గంటలకు బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో విచారిస్తామని నోటీసు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





