హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-II మంజూరు చేయండి

కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్‌ వినతి

దిల్లీ, జూన్‌ 19: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-IIకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్‌-II అవసరం ఎంతో ఉందని తెలియజేశారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇది సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతోపాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని, సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని రేవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. మెట్రో ఫేజ్‌-II ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌ రెడ్డి, ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పి.జితేందర్‌ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page