– అమెరికా పర్యటన ఎందుకో వివరంగా చెప్పాలి
– మేయర్ మమ్దానీని ఎందుకు కలవాలనుకున్నారో చెప్పాలి
– నిబంధనల మేరకే కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయాలు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ
న్యూదిల్లీ, ఆగస్ట్ 25 : అమెరికా పర్యటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతోనే తన యూఎస్ పర్యటనను కేంద్రం అడ్డుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం అని కొట్టిపారేశారు. అనుమతులు లేకుండా ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారంటూ తెలంగాణ సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. స్థాయికి తగినట్లుగా ఈ పర్యటన లేదని తెలిపారు.ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనపై తాము కొత్తగా నిబంధనలు పెట్టలేదని గుర్తు చేశారు. స్వాతంత్య్రం నుంచి ఉన్న నిబంధనలే తాము అమలు చేశామని స్పష్టం చేశారు. ఇది సాధారణ పక్రియ.. ఇందులో రాజకీయాలకు తావు లేదన్నారు. భారత్పై విషం చిమ్మే వ్యక్తి న్యూయార్క్ మేయర్ మామ్దానీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారంటూ వార్తలు వచ్చాయని వివరించారు. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యనించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మామ్ధానీను ఎందుకు కలుస్తున్నారో.. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గతంలో తన విదేశీ పర్యటనను కూడా కేంద్ర విదేశాంగ శాఖ నిరాకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. మన దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ సీఎంకు యూఎస్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. తమకు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ వాదించడం వితండవాదమని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనను నిరాకరించిందని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ బిజినెస్ కోర్సు చదివేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలను కూడా గతంలో రద్దు చేసిందని చెప్పారు. కుల గణన అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని తెలిపారు. హైదరాబాద్లో 20 శాతం ఇళ్లలో కులగణన జరగలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కుల గణనపై అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సింగరేణి అభివృద్ధికి చొరవ
గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం తాను అనేక చర్యలు తీసుకుంటున్నానని, సంస్థ దుబారా ఖర్చులు తగ్గించడం, ఉత్పత్తి పెంచడంతోపాటు బొగ్గు గనులను కేటాయించే విషయంలో చొరవ తీసుకుంటున్నానని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రిలోని పవర్ ప్లాంట్కు బొగ్గు సరఫరా అయ్యేలా ఒప్పందం జరిగిందన్నారు. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కూడా సింగరేణికి ఇచ్చేలా చొరవ చూపానని చెప్పారు. పీకేఓసీ-2ఓపెన్ కాస్ట్ డిప్సైడ్ బ్లాక్ కూడా సింగరేణికి వచ్చేలా అనేక మందితో మాట్లాడి చర్యలు తీసుకున్నాను. మరో బ్లాక్ కూడా సింగరేణికి వచ్చేలా ప్రయత్నిస్తున్నాం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోయగూడెం బ్లాక్-3 విషయంలోనూ సానుకూలత నెలకొందని అన్నారు. వేలంలో ఈ బొగ్గు గని దక్కించుకున్న ప్రైవేటు కంపెనీ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయకపోవడంతో ఆ కంపెనీని రద్దు చేసి మళ్లీ వేలానికి తీసుకొచ్చామని, ఇప్పుడు ఈ బ్లాక్ కూడా కూడా సింగరేణికి వచ్చేలా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో ఈ గనిని రెండుసార్లు వేలం వేస్తే అప్పుడు అధికారంలో ఉన్న బీఆరఎస్ సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేయడంతో ప్రైవేటు కంపెనీకి వచ్చేలా చేశారని ఆరోపించారు. అయితే సకాలంలో ఉత్పత్తి ప్రారంభించకపోవడంతో ఆ కంపెనీ నుంచి ఆ బ్లాక్ను తిరిగి తీసుకున్నామని, ఈ కోయగూడెం బ్లాక్-3 ద్వారా 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడ గ్రేడ్-13 బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉందంటూ దీని నుంచి బయటపడాలంటే బొగ్గు ఉత్పత్తిలో నూతన బ్లాకులు సాధించుకోవడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. సింగరేణికి ఇవ్వాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఇవ్వాలన్నారు. బకాయిల విడుదలలో గతంలో బీఆరఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి ఒకేలా ఉందంటూ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వచ్చిన బొగ్గు డబ్బులను తిరిగి ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సమంజసం కాదని అన్నారు. రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కిషన్రెడ్డి కోరారు. మణుగూరు పీకేఓసీ డిప్సైడ్ బ్లాక్కు సంబంధించి కూడా జెన్కో వేలంలో పాల్గొందని, అయితే అందరితో మాట్లాడి ఆ బ్లాక్ సింగరేణికి వచ్చేలా చేశానని, ఇప్పుడు కూడా ఈ బ్లాక్ వచ్చేలా అందరూ సహకరించాలని కోరుతున్నానని అన్నారు.




