– పత్తి కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ
– మద్దతు ధర పెంపుపై పార్లమెంటులో రాహుల్తో కలిసి పోరాటం
– గోల్ తండాలో సీసీఐ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి
తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. తేమ శాతం పేరుతోగానీ, తరుగు పేరిట గానీ రైతులను ఇబ్బందులు పెట్టి మద్దతు ధరలో కోత విధిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులను, మిల్లు యజమానులను హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండలం గోల్ తండా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెటింగ్ శాఖ సంచాలకురాలు జి.లక్ష్మీబాయితో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుత వానాకాలం సీజన్ 2025లో పాలేరు నియోజకవర్గంలో ప్రారంభమైన మొట్టమొదటి సీసీఐ కేంద్రం ఇదేనని గుర్తు చేశారు.
ప్రస్తుత సీజన్లో అతి భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్రస్తుత మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదన్నారు. అందుకే పత్తి ధరను పెంచాల్సిన ఆవశ్యకత ఉందంటూ ఈ విషయంపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకుంటూ చర్చను లేవదీసి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అన్యాయం జరిగితే కఠిన చర్యలే
రైతులు తమ పత్తిని ఎలాంటి ఆందోళన లేకుండా అమ్ముకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి సీసీఐ కేంద్రం వద్ద వచ్చే అభ్యంతరాలను ముఖ్యంగా తేమ శాతం విషయంలో రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రైతులకు అన్యాయం చేయాలని చూసే వారిపై ఈ కమిటీ తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రతి వ్యవసాయ అధికారి వద్ద తేమ యంత్రాలు ఏర్పాటు చేశామని, రైతుల పొలాల వద్దకే వెళ్లి తేమ శాతాన్ని పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంటి వద్దే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పత్తి రైతులకు నష్టం చేయాలని ఏ అధికారి ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథబాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ‘ఆత్మ’ కమిటీ చైర్మన్ శివరామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ బి.రాజశేఖర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





