మృతులు కుటుంబాలకు సానుభూతి
రూ.2లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
ఘటన విచారకరమన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ఏప్రిల్ 30: సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుకోని ఘటనలో ఏడుగురు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలుపుతూ వారికుంబాలకు సానుభూతి ప్రకటించారు.. ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.
కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పలువురు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేసినట్లు ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. సింహాచలం ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన ఘటనలో పలువురు మృతి చెందిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదో దురదృష్టకర ఘటన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢసానుభూతి తెలియచేశారు.