యాసంగి లోను రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి
70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సర్కార్ రెడీ
127 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
8,381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15,000 కోట్లు విడుదల చేసిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం దిగుబడిలో ఖరీఫ్ సీజన్ లో యావత్ భారతదేశంలొనే రికార్డ్ సృష్టించిన తెలంగాణ రాష్ట్రం.. రబీ సీజన్ లోనూ అదే రికార్డ్ సృష్టించ బోతుందని ఆయన పేర్కొన్నారు. యాసంగిలో తెలంగాణ రైతాంగం 54.89 లక్షల ఎకరాలలో సాగు చేయగా 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీ లోని పౌర సరఫరాల శాఖా కేంద్ర కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోనీ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖా రూపొందించిన విధివిధానాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సునిషితమైనదని రానున్న 20 రోజులు అత్యంత కీలకమైనవని ఈ సమయంలో కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలులో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడినట్లు కలెక్టర్ల దృష్టికి వస్తే సత్వరమే చర్యలు తీసుకోవడంతో పాటు పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి ఎస్.చౌహన్ ను సంప్రదించాలని ఆదేశించారు.
ధాన్యంకొనుగోలు చేసిన 48 గంటల్లోపు నగదు జమ
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోపు మద్దతు ధరను రైతుల ఖాతాలో జమ చేయడంతో పాటు సన్నాలకందించే బోనస్ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు గాను ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,381 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 13.71 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచామని మరో 3.79 కోట్ల గోనె సంచులు సమీకరిస్తున్నట్లు ఆయన వివరించారు.అయితే తేమ శాతాన్ని పరిశీలించిన మీదటనే రైతులకు గోనె సంచులు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు గోదాములు అందుబాటులో లేని చోట్ల నేరుగా రైస్ మిల్లులకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు
మధ్యంతర గోదాముల వసతి ఉన్న చోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఆయా గోదాములకు తరలించాలన్నారు.
అవసరం అని భావించిన ప్రాంతాల్లో ఇప్పటికే పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిలువ ఉంచే సామర్ధ్యం కలిగిన గోదాములను కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 29 లక్షల మెట్రిక్ టన్నులకు పై బడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని, సుమారు 2.55 లక్షల రైతుల నుండి 19.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం అందించే మద్దతు ధర ప్రకారం 4,545.72 కోట్లు కాగా ఇప్పటివరకు 2,289 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని ఆయన తెలిపారు.సన్నాలకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ మొత్తం 444.20 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమౌతుందన్నారు.
వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి తెలిపేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాలలో ప్రతి రోజు ఉదయం వాతావరణ సమాచారాన్ని వివరిస్తున్నట్లు చెప్పారు. ఎండ వేడిమికి ఇబ్బంది పడే రైతులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. తేమ శాతాన్ని లెక్కించే డయ్యర్ లను కొనుగోలు చేసిన కరీంనగర్ కలెక్టర్ ను ఆయన అభినందిస్తూనే మిగిలిన జిల్లాలలో కుడా ఇది అమలు పరచలన్నారు.ధాన్యం నాణ్యతతో పాటు త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు దోహదపడుతుందన్నారు. అయితే అదే సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు వీలుగా వాహనాల ఏర్పాటు చేయడంతో పాటు హమాలీల సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని నిబంధనల మేరకు హార్వెస్టర్ల పనితీరును పరిశీలించడంతో పాటు బ్లోయర్ల పని తీరును గమనించాలని ఆయన అధికారులను ఆదేశించారు అయితే కొనుగోలు చేసిన ధాన్యాన్ని 1,579 రైస్ మిల్లులను సి.యం.ఆర్ నిమిత్తం గుర్తించినట్లు ఆయన తెలిపారు.ఇప్పటికే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆయా రైస్ మిల్లులకు కేటాయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన
కొత్తగా మంజూరు చేయనున్న తెల్ల రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు పెట్టుకున్న దరఖాస్తులను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.పరిశీలన పూర్తి అయిన వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చెయ్యాలని ఆయన అధికారులను ఆదేశించారు.