– ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు
న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు ధరలు పెంచక తప్పదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చన్నారు. స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఎఓఈ) నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారుల పైకి బదిలీ చేసే అవకాశం ఉందని గవర్నర్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. అయితే ఇది ఎంతకాలం సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. చమురు ధరలు పెరిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వస్తువుల రవాణా ఖర్చులపై ప్రభావం చూపి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి కేంద్రం పెంచింది. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొంతకాలంగా చమురు ధరలూ పెంచుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




