. దేశమంతా *యుద్ధం-శాంతి* పైనే చర్చ జరుగుతున్నది. మధ్య భారతంలో మావోయిస్టులపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. వారి అంతమే మా పంతం అని స్పష్టం చేస్తూ వచ్చింది. ఇంకో పక్క కాశ్మీర్ లో జరుగుతున్న హింసతో పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది . రిహార్సల్ గా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేయమని పిలుపునిచ్చింది. ఈ రెండు ఘటనలలో మొదటిది దేశ పౌరులపైన, రెండవది పొరుగు దేశం పైన దాడిగా అర్థం చేసుకోవచ్చు. దేశంలో మావోయిస్టుల పై దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని మేధావులు బుద్ధి జీవులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కవులు కళాకారులు,రచయితలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండవది పాకిస్తాన్ పై యుద్ధం మతోన్మాదానికి లంకె పెట్టడం పొరుగు పైన దేశం పైన కాబట్టి ఎవరూ దీన్ని పెద్దగా వ్యతిరేకించ లేకపోతున్నారు. ఏది ఏమైనా దేశంలో భయానక యుద్ధ వాతావరణం ఏర్పడి, సాధారణ ప్రజల గుండెల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. యుద్ధ నీతి పాటించబడుతుందా? లేదా? శాంతియుత వాతావరణం ఏర్పడుతుందా? అన్నదానిపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.
దక్కన్ పీఠభూమిలో అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేoదుకే మావోయిస్టులపై యుద్ధం ప్రకటించారని యావత్ పౌర సమాజం గాఢంగా విశ్వసిస్తున్నది . దండకారణ్యంలో భయానక పరిస్థితులు కల్పిస్తూ, లక్షలాది ఆదివాసీలను వారి ప్రాంతాల నుండి తరిమేస్తున్నారన్నది ఆరోపణ. అందుకే బుద్ధి జీవులు దీన్ని కార్పొరేట్ యుద్ధంగా తేల్చి చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టుగా ఈ దేశ ప్రజలను, సైన్యం ప్రయోగించి చంపడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న మాట చెవికి ఎక్కించుకోవడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టు అనేవారు లేకుండా అంతం చేస్తామని సమయం, ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. శాంతి చర్చలు జరిపి సమస్య మూలాలను ప్రజలందరికీ తెలియజెప్పి,సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్ ను పాలకులు తిరస్కరిస్తున్నారు. శాంతి చర్చలకు ఆయుధాలు వీడాలనే షరతును ముందుకు తెచ్చారు. ఆయుధాలు వీడాలనే వితండవాదాన్ని ముందుకు తెస్తున్నారు. ప్రపంచంలో గాని, దేశంలో గాని ప్రభుత్వాలు జరిపిన చర్చలకు ఏనాడు ఈ సమస్య ఆటంకం కాలేదు. కానీ, ఇప్పుడు ఎందుకు ప్రధాన సమస్యగా చేస్తున్నట్టు? రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ అమలు కోసం ఆదివాసీలు తరాల తరబడి పోరాడుతూనే ఉన్నారు. వారికి అండగా పీపుల్స్ వార్ / మావోయిస్టులు నిలబడిన చరిత్ర అయిదు దశాబ్దాలకు మించదు. అలాంటప్పుడు 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఆదివాసీలకు కల్పించిన హక్కులకు భంగం కలగకుండా, అభివృద్ధి చేసి ఉంటే మావోయిస్టుల సమస్య తలెత్తేది కాదేమో! ఈ దేశ మూలవాసుల సంపదకు రక్షణ కల్పించి, వారి మౌలిక సమస్య పరిష్కారం జరగాలన్నదే ఉద్యమకారుల ప్రధాన ఆకాంక్ష. కానీ ఇది సాధ్యమయ్యేలా లేదు.
దేశంలో అతిపెద్ద కార్పొరేట్ శక్తులుగా ఎదిగి, ప్రభుత్వాలను అధికారంలో నిలబెట్టగలిగే స్థాయిలో ఉన్న అదానీ, అంబానీ, వేదాంత కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు శాంతి చర్చలకు అతిపెద్ద ఆటంకంగా మారాయి. ఈ విషయాలను బయటకు చెప్పకుండా ఆయుధాలు, ప్రైవేట్ హింస అనే అంశాలను ఎజెండా పైకి తీసుకొచ్చి శాంతి ప్రక్రియ కొనసాగకుండా పక్కదారి పట్టిస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మావోయిస్టుల సమస్యను రాజకీయం అంశంగా చూస్తామే తప్ప, శాంతి భద్రతల సమస్యగా పరిగణించబోమని స్పష్టం చేసింది. స్వరాష్ట్రంలో దశాబ్దా కాలం పాటు అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్/ బి. ఆర్. ఎస్ ఆదివాసులపై యుద్ధం ఆపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరిపి దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పాటుకు కృషి చేయాలని లక్షలాది మంది ప్రజల ఆమోదంతో ఆ పార్టీ అధినేత కె.సి.ఆర్. ప్రకటించారు.
వామపక్ష పార్టీలు, నక్సలైట్ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు శాంతి చర్చల ప్రాధాన్యతను, అవసరాన్ని అందరికంటే ముందుగానే ప్రకటిస్తూ వచ్చాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి యుద్ధం చేసే కంటే, ఆదివాసుల జీవించే హక్కు కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని బుద్ధి జీవులు చేసిన సూచన పెడచెవిన పెడుతున్నారు. ఇది మరింత దేశ ప్రజల అంతరంగిక అభద్రతకు గురిచేస్తున్నట్టు కనబడుతున్నది. ప్రజాప్రాయాన్ని గౌరవించడం, అన్ని పార్టీలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం ఏర్పరచడం పాలకుల విధి. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నిరుద్యోగం, నిరక్షరాస్యత, మహిళలపై దాడులు, మతోన్మాదం, అనారోగ్యం, తాగు, సాగునీరు అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు అలాగే మిగిలిఉన్నాయి. వీటి కి పరిష్కార మార్గాలు అన్వేశించ కుండా మిలటరైజేషన్తో అన్నీ పరిష్కారం అవుతాయని భావించడం అనాలోచిత చర్య. సమాజంలో హింసాయుత వాతావరణాన్ని స్థాపించడం అంటే ఫాసిజం వైపు అడుగులేయడమే. ఇది ప్రజా శ్రేయస్సుకు ఆటంకమే కాదు, ప్రమాదకరం కూడా.
ప్రపంచంలో మరో పక్క యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఎప్పుడు పొరుగు దేశంపై యుద్ధ ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో తెలియడం లేదు. ముస్లిం- హిందూ భేదభావం భారత సమాజమంతా విస్తరిస్తున్నది. తరాల తరబడి ఇక్కడే నివసిస్తూ దేశ పోరులుగా అందరితో కలిసి మెలిసి ఉంటున్న ముస్లింలు, క్రిస్టియన్లు అభద్రతాభావం లో ఉన్నారు. నిజానికి వారంతా దేశ స్వతంత్ర పోరాటంలో, దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములైన వారే. మతోన్మాదంతో కొంతమంది వ్యక్తులు చేసిన దుర్మార్గాలను యావత్ సమాజానికి విస్తరించే, అంటగట్టే ప్రయత్నం చేయడం శోచనీయం. దళితులపై, ఆదివాసీలపై, బహుజనులపైన మతాలకు, కులాలకు అతీతంగా దాడులు జరగడాన్ని, కారణాలను మన విశ్లేషించుకోగలగాలి. భారత ఉప ఖండంలో వివిధ భాషలు, వేషధారణ, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలు వేరువేరుగా ఉన్నా, భిన్నత్వంలో ఏకత్వంలా వందల ఏళ్ళుగా కలిసి ఉన్న కోట్లాది ప్రజలలో ఆసాంఘీక శక్తులు, విష బీజాలు నాటకుండా కాపాడుకోవాలి. రాజకీయాలకు అతీతంగా సమైక్య భావనతో ప్రజలంతా శాంతియుత సహజీవనం సాగించేలా కృషి చేయడం చట్టబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులది. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలది, రాజకీయ పార్టీలది. యుద్ధం ఏదైనా దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రజా జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయనేది ఇంతవరకు జరిగిన యుద్ధాలలో స్పష్టమైన నిష్టూర సత్యం. ప్రస్తుతం చైనా, రష్యాలు చెరో దేశానికి మద్దతు ప్రకటించాయి. భవిష్యత్తులో ప్రపంచ దేశాలు ఎటువైపు నిలబడతాయో తెలియదు. ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రధానంగా నష్టపోయేది తెలుగు రాష్ట్రాలని ప్రచారంలో ఉన్న విషయం మరిచిపోరాదు. వీలైనంతవరకు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని కోర్టులుకూడా మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే *యుద్ధం వద్దు – శాంతి ముద్దు* అని నినదిద్దాం. శాంతి స్థాపనకు నడుం బిగిద్దాం.
రమణా చారి