రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు

2024 ఎన్నికల వరకు దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు గోదావరి కావేరి అనుసంధానం అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది. 1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ మహానది కావేరి అనుసంధానం పేర సర్వే చేసి తొమ్మిది లింకులు ప్రతి పాదించింది. దక్షిణ భారత దేశంలో మహానది గోదావరి కృష్ణ పెన్నా కావేరి వైగయ్ గుండర్ నదుల అనుసంధానమిది. అందులో తొలి లింకు మహానది గోదావరి. ఒడిషాలో నవీన్ పట్నాయక్ అధికారంలో ఉండగా మహానది గోదావరి అనుసంధానానికి తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ కూడా చేసేది లేక మహానది గోదావరి అనుసంధానం అటకెక్కించి గోదావరి కావేరి అనుసంధానం తలకెత్తుకొంది. నాలుగైదు సంవత్సరాలుగా అదిగో పులి ఇదిగో తోక అంటూ పలు సమావేశాలు నిర్వహించారు. అదృష్టమేమంటే కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కెసిఆర్ అంగీకరించ లేదు. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీ రామ్ కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలో గల నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా ఈ కథా కమామీషు నడిపారు.
ఇంతకీ గమనార్హమైన అంశమేమంటే గోదావరి కావేరి అనుసంధానానికి గోదావరిలో నికర జలాలు మిగిలిలేవని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది . అప్పటికీ ఆగకుండా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఇంకా వాడుకోకుండా వున్న 141 టిఎంసిల నికర జలాలను తరలించుతామనే ప్రతి పాదన తెర మీదకు తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్న రోజుల్లో ఇందుకు ఛత్తీస్ ఘడ్ అంగీకరించ లేదు. కొసమెరుపు ఏమంటే ఛత్తీస్ గఢ్  లో తదుపరి బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించ లేదు. అంతిమంగా ఏమైనదో ఏమో గాని 2024 ఎన్నికల తర్వాత నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ గాని జాతీయ జల అభివృద్ధి సంస్థ గాని మౌనం పాటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో గోదావరి కావేరి అనుసంధానం అంశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఊగిసలాడింది. గాని కేసీఆర్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్ర ఆటలు సాగ లేదు. . 2024 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. ఇంతకీ గోదావరిలో నీటి లభ్యత గురించి గణాంకాలు పరిశీలించితే ఎవరి లెక్కలు వారివే. పైగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎవరి వాటా ఎంతో తేల లేదు. ప్రస్తుతం తాత్కాలికంగా మౌనం పాటించుతున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ ఎప్పుడు అమ్ముల పొది నుంచి అస్త్రాలు బయటికి తీస్తారో వేచి చూడాలి!
 సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉంటే  ఏకాభిప్రాయం ఏలా సాధ్యం?
ఇదిలా వుండగా తాజాగా సుప్రీం కోర్టులో స్టే వున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు – 2(2013)నోటిఫై చేసేందుకు కృష్ణా బేసిన్ లోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రుల సమావేశాన్ని మే 7 వతేదీ ఏర్పాటు చేశారు. కాని ఆంధ్ర ప్రదేశ్ తరపున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సమావేశాన్ని రెండు వారాల పాటు వాయిదా వేయమని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీనికి తోడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సమావేశం గురించి ఎట్టి వార్తలు వెలువడ లేదు. బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పులో విధించిన గడువు తీరిన తర్వాత 2004 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నియామకం జరిగింది. ట్రిబ్యునల్ 2010 లో మధ్యంతర తీర్పు 2013 లో తుది తీర్పు ప్రకటించింది. ఈ తీర్పు ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా వుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అపకారం చేస్తుందని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కి స్టే తెచ్చింది. వాస్తవంలో ఈ తీర్పు కర్ణాటక మహారాష్ట్రాలకు అనుకూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అపకారం చేసేదిగా వుంది. ఇన్నేళ్లు గడిచినా స్టే వెకేట్ కాలేదు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వున్న రోజుల్లో స్టే వెకేట్ చేయించేందుకు జరిగిన యత్నాలు ఫలించ లేదు. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య స్టే వున్నా ఆల్మట్టి ఎత్తు పెంచుకొనే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆభ్యర్థించారు. దీనికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తొందర పడుతోంది. దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలు వున్నా వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు చొరవ చూపని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ కర్ణాటక ముఖ్యమంత్రి అడిగినదే తడవుగా ఏకాభిప్రాయం సాధించేందుకు బేసిన్ లోని రాష్ట్రాల మంత్రుల సమావేశం ఏర్పాటు చేయడంలోని ఆంతర్యమేమిటో?
బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు పూర్తి భిన్నంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు!
1975లో వెలువడిన బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పులో బేసిన్ లోని ఏ రాష్ట్రంలో గాని తాము కేటాయించిన వాటా నీళ్లు వినియోగంలో వుంటే వాటిని తన తర్వాత వచ్చే ట్రిబ్యునల్ లేక అథారిటీ ఇతరులకు కేటాయించ కూడదని స్పష్టంగా నిర్దేశించింది. తత్ఫలితంగా తదుపరి 2004 లో నియమింపబడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జోలికి వెళ్లలేదు. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత కింద లెక్క గట్టి అన్ని రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేసింది. మిగులు జలాలను వాడుకొనే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. అంతే కాకుండా క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీలు నిల్వ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. కాని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత కింద నికర జలాలు 163 టిఎంసిలు సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలు 285 టీఎంసీలు మొత్తం 448 టిఎంసిలు బేసిన్ లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. కృష్ణలో మిగులు జలాలు చుక్క లేకుండా చేసింది. ఈ తీర్పు ఏక పక్షంగా కర్ణాటక మహారాష్ట్రాలకు లబ్ది చేకూర్చగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోక కోసి సున్నం పెట్టింది.
మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు అనుకూలం!
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత కింద కర్ణాటక కు 65 టిఎంసిలు సరాసరి లభ్యత కింద మిగులు జలాలు 105 టిఎంసిలు లతో పాటు ఆవిరి పారుదల కింద 7 టీఎంసీలు మొత్తం 177 టిఎంసిలు నేరుగా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది. పైగా ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుండి 525 మీటర్లు ఎత్తు పెంచుకొనేందుకు అనుమతించింది. ఆల్మట్టి జలాశయంలో అదనంగా మరొక 130 టీఎంసీలు నిల్వ చేసుకొనే అవకాశం కల్పించింది. అదే విధంగా మహారాష్ట్ర కు 65 శాతం నీటి లభ్యత కింద 43 టిఎంసిలు సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలు 35 టిఎంసిలు ఆవిరి పారుదల కింద 3 టిఎంసిలు కలిపి మొత్తం 81 టిఎంసిలు కేటాయించింది. ఉమ్మడి ఆంధ ప్రదేశ్ వచ్చే సరికి 65 శాతం నీటి లభ్యత కింద 39 టిఎంసిలు సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలు 145 టిఎంసిలు ఆవిరి పారుదల కింద 6 టిఎంసిలు కేటాయించింది. దుర్మార్గమేమంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గణాంకాల కింద 190 టిఎంసిలు చూపెట్టినా ఇందులో 150 టిఎంసిలు క్యారీ ఓవర్ కింద వాడుకోమని మేక చన్నుతో సమానమైన కేటాయింపులు చేసింది.
ఇంతకన్నా ఘోరమైన అన్యాయం మరొకటి ఉండదు. ఒక వేళ అయితే గియితే కేంద్ర ప్రభుత్వం బేసిన్ లోని భాగస్వామ్యం రాష్ట్రాలను ఒప్పించి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (2013)తీర్పు నోటిఫై చేస్తే తిరిగి 2050 సంవత్సరం వరకు ఎవ్వరూ ఏమి చేయగలిగింది లేదు. ఈ తీర్పు శిరోధార్యమే. ఈ అంశాన్ని ట్రిబ్యునల్ తన తీర్పు క్లాజ్ 16 లో స్పష్టంగా పేర్కొన్నది . అంతేకాదు ఈ ట్రిబ్యునల్ తీర్పే కాదు 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద నియమింపబడిన ఏ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే తదుపరి తుదకు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొనే అవకాశం లేదు.
కర్ణాటక ఎందుకు తొందర పడుతున్నదంటే రిజర్వాయర్ 525 మీటర్ల స్థాయికి పెంచాలంటే కొత్తగా క్రస్ట్ గేట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఈ పాటికే రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు 525 మీటర్లకు అమర్చి ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ మేరకు క్రస్ట్ గేట్లను 519 మీటర్లకు కట్ చేశారు. ఇప్పుడు 2013 లో వెలువడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి దౌత్యంతో ఏకాభిప్రాయం కుదిరి సుప్రీంకోర్టులో ఉన్న కేసు వెనక్కి తీసుకుంటే ప్రస్తుతం  519 మీటర్ల నుండి మరో ఆరు మీటర్ల ఫీట్లు వెల్డింగ్ చేస్తే సరి పోతుంది. 300 పై చిలుకు టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ఆల్మట్టి ఎత్తు 519 మీటర్లకు ఉన్నపుడే ఆలస్యంగా కృష్ణకు వరద వస్తోంది. 525 మీటర్ల ఎత్తుకు పెంచడితే దిగువ రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కు హళ్లికి సున్నాకు సున్నా మిగులుతుంది. ఈ అంశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎన్ని వివాదాలు వున్నా అవన్నీ పక్కన పెట్టి సమిష్టిగా ఈ తీర్పు నోటిఫై కాకుండా చూడ వలసి ఉంది.
image.png
వి. శంకరయ్య 
విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page