పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లేనా ?

   ఉగ్రవాదులను పెట్టిపోషించి, దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లేనా.. గత రెండు రోజులుగా పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టినచర్యలు ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న భారత ప్రజలకు స్వాంతన చేకూరినట్లేనా అంటే, తోక ఒంకర ఉండే దాయాది దేశానికి ఇది ఎట్టి పరిస్థితిలోనూ సరిపోదంటున్నారు. ప్రపంచ చిత్రపటంలో పాక్‌ పటం కనిపించకుండా చేసినప్పుడే ముష్కరులచేతిలో మృతి చెందినవారి ఆత్మశాంతిస్తుందంటున్నారు. గతనెల 22న పహల్గాంలో అమాయకులైన 26మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడాన్ని ప్రపంచ దేశాలన్నీ విస్మయాన్ని వ్యక్తం చేశాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకిలించి వేయాలని ఆయా దేశాధినేతలు ఆవేశపడ్డారు. దశాబ్దాలుగా వీరి దుశ్చర్యలను అనుభవిస్తూ వొచ్చిన భారత్‌కు కూడా ఈ దుస్సంఘటన తో సహనం నశించింది. ఉగ్ర వాదులతో పాటు వారిని ఆ విధంగా తయారు చేస్తున్నవారిని ఇక ఎట్టిపరిస్థితిలో ఉపేక్షించేదిలేదన్న నిర్ణయాన్ని భారత్‌ తీసుకుంది. అందుకు మే 7 బుధవారం అర్ధరాత్రి ముహూర్తం నిర్ణయించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రశిబిరాలపై భారత్‌ బాంబుల వర్షం కురిపించింది. అన్నట్లుగానే ఉగ్ర వాదుల తోపాటు వారిని తయారు చేస్తున్న నాయకులు, ఉగ్రవాదులను తయారుచేస్తున్న కార్ఖానాలను  మట్టికరిపించారు. ఈ ఆపరేషన్‌కు భారత సర్కార్‌ సింధూర్‌గా నామకరణం చేశారు. పాకిస్తాన్‌ భూభాగంలోకి వెళ్ళకుండా రాఫెల్‌ యుద్ద విమానాలను, క్షిపణులను తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మళ్ళించారు. కనీసం ఏం జరుగుతున్నదన్న విషయాన్ని పాకిస్తాన్‌ ఆలోచించుకునేలోగానే వందమంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇందులో జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ తప్పించుకోగా ఆయన సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌, పదిమంది వారి కుటుంబ సభ్యులు మృతిచెందారు. పాక్‌దేశంలో కాలుమోపకుండా భారత్‌ చేసిన దాడులతో ఇంతవరకు తమ వద్ద ఉగ్రవాదులు లేరని బొంకుతూ వొచ్చిన పాక్‌ ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వొచ్చింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలపై భారత్‌ చేసిన దాడి పాకిస్తాన్‌కు కారం పెట్టినట్లైంది. దీంతో బుధ, గురువారాల్లో అక్రమదాడులకు పాల్పడింది . సరిహద్దు గ్రామాల్లోని అమాయక ప్రజల పైన తన ప్రభావాన్ని చూపించింది. ఇంకా చూపిస్తూనే ఉంది. అలాగే జమ్ము, పఠాన్‌కోట్‌, ఉద్దంపూర్‌లలో క్షిపణి, డ్రోన్‌లతో దాడులకు పాల్పడింది . ఈ దుశ్చర్యలో మరో పదహారు మంది సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంది. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంతటితో ఆగకుండా భారత సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడింది . సరిహద్దులో ఉండే దాదాపు 15 భారత సైనిక స్థావరాలపై గురువారం కవ్వింపు చర్యలకు పాల్పడింది .  అప్రమత్తమైన భారత్‌ సైన్యం వాటిని సునాయాసంగా తిప్పికొట్టింది. దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.  భారత్‌ ఎయిర్‌, డిఫెన్స్‌, నేవీ దళాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. పాకిస్తాన్‌ ముఖ్యపట్టణమైన కరాచీ నౌకాశ్రయంపైన భారత్‌ తన అమ్ముల పొదలోని ఐఎస్‌ఎస్‌ విక్రాంతతో బాంబుల వర్షం కురిపించి, సుమారు పది నుండి పదిహేను నౌకలను ధ్వంసం చేసింది.
అలాగే పఠాన్‌కోట, జమ్ములపై పాక్‌ ప్రయోగించిన యుద్ద విమానాలను ఎస్‌ 400తో నేలకూల్చింది. దీనికి ప్రతీకారంగా ఇస్లామాబాద్‌, లాహోర్‌, సియాల్‌కోట, కరాచి, రావల్పిండిలాంటి పాకిస్తాన్‌ ప్రధాన పట్టణాలను భారత్‌ టార్గెట్‌ చేసింది. ఈ ప్రాంతాలపై క్షిపణులపై భారత సైన్యం కూడా దాడి చేయక తప్పని పరిస్థితి. ఈ ప్రాంతాల్లోని ఏయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేయడంతో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమ్యునికేషన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో పాక్‌ కూడా ఎదురుదాడికి పూనుకుంది. కుప్యాడా, బారాముల్లా, యూరీ, పూంచ్‌, మెంధార్‌, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్‌ షెల్లింగ్‌లు, ఫైరింగ్‌లకు పాల్పడింది . అయితే భారత్‌ భద్రతాదళాలు ఎవరికీ ఎలాంటి నష్టం కలుగకుండా వాటిని నిర్వీర్యం చేయగలిగారు. అయినా నిరంతరాయంగా పాక్‌ ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పహల్గాం సంఘటన తర్వాత ఇండియా ప్రతీకార చర్యలకు పాల్పడినప్పటికీ కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది.
ఈ దాడుల్లో పాకిస్తాన్‌ ప్రజలకుగాని, పాకిస్తాన్‌ మిలటరీకిగాని నష్టంవాటిల్లకుండా చర్యలుచేపట్టింది. కాని, పాకిస్తాన్‌ అందుకు విరుద్దంగా భారత్‌ సామాన్య ప్రజలపైన దాడులు చేస్తున్నది. హిందూదేవాలయాలను, ఎయిర్‌పోర్టులను లక్ష్యంగాచేసుకుని విజృంభిస్తున్నది. ఇదిలాఉంటే ఉగ్రవాదులతో తమకు సంబంధం  లేదంటూనే, అపరేషన్‌ సింధూర్‌లో మృతిచెందిన ఉగ్రవాదుల మృతశరీరాలపైన పాకిస్తాన్‌ జండానుకప్పి ప్రభుత్వ లాంచనాలతో ఖనను చేయడమన్నది ‘వెనుకటి గుణమేలమాను’ అన్నట్లుగానే పాక్‌తీరు ఉన్నదంటున్న భారతీయులు, ఎలాగూ యుద్దం మొదలైంది కాబట్టి ప్రపంచ చిత్రపటంలో పాక్‌ అన్నది లేకుండా చేయాలని భారత్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాని పక్షంలో పాక్‌ ఆక్రమించిన భారత్‌(పిఓకె) ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంవల్ల భారత్‌ చేపట్టిన ప్రతీకార చర్యకు అర్థాన్నిస్తుందన్న అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page