పాక్ గడ్డపై గర్జించిన భారత యుద్ధ విమానాలు
ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు
కనీసం వందకు పైగానే ఉగ్రవాదుల హతం
వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు
ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు
కనీసం వందకు పైగానే ఉగ్రవాదుల హతం
వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు
న్యూదిల్లీ, మే 7 : భారత యుద్ధ విమానాలు మరోమారు గర్జించాయి. పాక్ భూభాగంలోని ఉగ్రమూకలు లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. అర్ధరాత్రి వేళ మన విమానాలు దాయాది ఆక్రమణలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ సహా పాక్లోని మొత్తం 9 ఉగ్రస్థావరాలను వైమానికదళం ధ్వంసం చేసింది. కేవలం అరగంటలోనే ఈ తొమ్మిది స్థావరాలు భస్మీ పటలమయ్యాయి. ఈ విశేషాలను కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాక్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోట్లీలోని గుల్పూర్ టెర్రర్ క్యాంప్పై ఎలా దాడి చేశామనేది సోఫియా ఖురేషి వీడియో ప్రదర్శించారు. ఇక్కడే గతంలో ‘ఫూంచ్’ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారని పేర్కొన్నారు. అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 గంటల వరకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. దాదాపు 25 నిమిషాల పాటు సాగింది.
“పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలతోపాటు పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేర క్షిపణులతో దాడిచేసి వాటిని నేలమట్టం చేసింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను, సుమారు వందమంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు తెలుస్తున్నది. ఇందులో ఉగ్ర సంస్థలకు చెందిన ఆగ్రనాయకులు మృతి చెందినట్లు వార్తలు వొస్తున్నాయి… ఇంత పెద్ద యుద్ద వాతావరణానికి సంబంధించిన వార్తను సహజంగా ప్రధాని లేదా హోంశాఖ మంత్రి లేదా మిలటరీ అత్యున్నత అధికారులు కాకుండా సైన్యానికి చెందిన మహిళ అధికారులు ప్రజలకు తెలియజేయడం. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు దాడి జరిగిన వివరాలను మీడియా సమావేశంలో ప్రజలకు తెలియజేశారు. అంటే భారత మహిళలు అపరకాళిలుగా ఎలా విజృంభిస్తారన్న మరో మెసేజ్ను పాకిస్తాన్కు తెలియజేసినట్లయింది..”
పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని పేర్కొన్నారు. భావల్పూర్ టెర్రర్ క్యాంప్ అంతర్జాతీయ సరిహద్దుకు 30 కి.మీ దూరంలోనే ఉంటుంది. లష్కరే తోయిబాకు చెందినదిగా గుర్తించాం. రాజౌరి ఫూంచ్ ప్రాంతాల్లో ఇందులోని ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడే 2023, 2024లో ఫూంచ్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాదులు శిక్షణ పొందినట్లు మాకు సమాచారం ఉందని సోఫియా తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా కూడా గాయపడ్డారని సమాచారం. అయితే, భారత్ ప్రతికారంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.