– ఆయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత రెండో దీపావళి
– ప్రజలకు దీపావళి శుభాకాంక్షలతో ప్రధాని మోదీ లేఖ
న్యూదిల్లీ, అక్టోబర్ 21: ’అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి.. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు.. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాడు.. ఆపరేషన్ సిందూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడటంతోపాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉందంటూ మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయని తెలిపారు. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో హింసా మార్గాన్ని విడిచిపెట్టి జన జీవన స్రవంతిలోకి వచ్చిన అనేకమందిని మనం ఇటీవల చూశామని, ఇది దేశానికి ఇది ఒక గొప్ప విజయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ది చేకూరుతున్నదన్నారు. పౌరులు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అన్ని భాషలను గౌరవించాలని, ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. మనం తీసుకునే ఆహారంలో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించి యోగాను ఆచరిద్దామన్నారు. ఈ ప్రయత్నాలన్నీ మనల్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తాయన్నారు. దసరా నవరాత్రులు ప్రారంభ వేళ జీఎస్టీ ధరలను భారీగా తగ్గించామన్నారు. భవిష్యత్తు తరం కోసం సంస్కరణలలో భాగంగా వీటిని చేపట్టామన్నారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలోని పౌరులకు రూ.వేల కోట్లు ఆదా చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. అంతేకాక ఈ నిర్ణయం జీవితాన్ని సులభతరం చేయడంతోపాటు ఆర్థిక వృద్ధిని పెంచుతుందన్నారు. ఇక భారత్, ఉత్తమ భారత్ స్ఫూర్తిని నిలబెట్టేందుకు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన సైతం కల్పించుకోవాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





