పొరుగు దేశాలు

“ప్రతి యుద్ధం ప్రారంభం చీకటి గది తలుపు తెరిచినట్లుగా ఉంటుంది.
చీకటిలో ఏం దాగి ఉందో ఎవరికీ తెలియదు..”
-హిట్లర్

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ..ముష్కరులకు శిక్షణా ..ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ప్రపంచం ముందు ఈ రోజు నగ్నంగా నిలబడ్డది. టర్కీ మినహా ఏ దేశం కూడా పాకిస్థాన్ కు అండగా నిలబడే అవకాశం కనిపించడం లేదు. భారత్ పాకిస్తాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రికతల నడుమ ..యుద్ధం వలన అపారమైన ప్రాణ నష్టం ..ఆర్ధిక నష్టం కలిగే ప్రమాదమున్నందున యుద్ధ నివారణకు ప్రయత్నించాలని కొందరు శాంతి కాముకులు కోరుతుంటే ..ప్రపంచ చిత్ర పటంలో పాకిస్థాన్ ను సంపూర్ణంగా స్థానం లేకుండా చేయాలని మెజారిటీ భారత పౌరుల ఆవేశం ..! పాకిస్థాన్ దేశం ఏర్పడిన నాటి నుండి కూడా ఆ దేశం పాలకులు సైన్యం కనుసన్నల్లో ఉన్నవారే ..భారత్ ను నేరుగా ఎదుర్కొనే సాహసం చేయలేక పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణా ..ఆశ్రయం కల్పిస్తూ మన దేశం పై ఉగ్రదాడులు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నది. భారత్ లో పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్య వాతావరణాన్ని, శాంతిని, ఆర్ధిక పరిస్థితిని అస్థిరపరిచే దుష్ట పన్నాగం గత దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉన్నది. ప్రస్తుతం ఆ దేశం లో పాలకులయినా ..సైనికాధికారులయినా ..ఉగ్రవాద ముఠాలకు దాసోహం అనే పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్థాన్ రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆలోచించినట్లయితే..ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధానికి పోతే అక్కడి సాయుధ మతోన్మాద శక్తులే బలపడతాయి.పాకిస్తాన్ ఉనికిని వారు మాత్రమే కాపాడగలరని సగటు పాకిస్తానీలు సహితం భావించే ప్రమాదం ఉంది.

అప్పుడు ఇరుదేశాల సమాజాలకు ఒక బెడదగా ఉన్న ఉగ్ర సంస్థలు ప్రస్తుతం ఉన్న పాలకుల స్థానం లో అందలం ఎక్కవొచ్చు.అది మనకు మంచిది కాదు.. పాకిస్తాన్ కూ మంచిది కాదు.. గత మూడు రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం యుద్ధ సన్నాహాలు కోసమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మే 9 రష్యా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. దేశ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర కాల్పులు కొనసాగుతున్నాయి. భారత్ తమ పై ఏ సమయాన్నైనా దాడి చేయొచ్చని పాకిస్థాన్ సైనికాధికారులు ప్రకటన చేస్తుంటే భారత్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది. పహల్గామ్ దుర్ఘటనలో ఉగ్రవాదుల దాడిలో 27 మంది అమాయక పర్యాటకులు అసువులుబాసి 13 రోజులవుతున్నా కేంద్ర ప్రభుత్వం ముష్కరులను గుర్తించడంలో .. వారిని మట్టుబెట్టడంలో విఫలమైందన్న ఆరోపణల మధ్య దేశ రక్షణ త్రివిధ దళాలు పాకిస్థాన్ పై దాడికి సకల అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో మన సరిహద్దు దేశాల వైఖరి ని కూడా పరిగణలోకి తీసుకోవలసిన అవసరమున్నది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం అనివార్యమైతే, భారత్‌కి తన ఇతర పొరుగు దేశాల నుంచి ఏ రకమైన మద్దతు లభించనుంది? వారెవరి వైఖరి ఎలా ఉండబోతోంది? ఇది అత్యంత కీలక ప్రశ్న. పహల్గాం ఉగ్రదాడిలో చైనా ప్రమేయం కూడా ఉన్నదని పాకిస్థాన్ మాజీ సైనికాధికారి ఒకరు వెల్లడించిన నేపథ్యంలో చైనా పాకిస్థాన్ తో యుద్ధానికి భారత్ ను ప్రోత్సహిస్తుంది కానీ సహకరించదు.

పరోక్షంగా పాకిస్థాన్ కు వ్యూహాత్మక మద్దతును ఉదాహరణకు ఆయుధాల సరఫరా, పర్యవేక్షణ సమాచార రూపంలో అందించే అవకాశముంది. అమెరికా ,చైనా ల మధ్య కొనసాగుతున్న వ్యాపార వాణిజ్య సుంకాల యుద్ధంతో చైనా నుంచి పలు విదేశీ పెట్టుబడి సంస్థలు అక్కడి నుండి తరలిపోయి భారత్ లో తమ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని మొగ్గు చూపుతున్న నేపథ్యంలో యుద్ధం జరిగితే అది దీర్ఘ కాలం కొనసాగాలని చైనా అభిలాషిస్తుంది. భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ను పరోక్షంగా వ్యతిరేకించడం వల్ల చైనాకు వ్యూహాత్మక లాభం. యుద్ధానికి సహకరించకుండా, భారత్‌ను ఒంటరిగా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. సరిహద్దుల్లో మరో దేశం బంగ్లాదేశ్ చైనా మీద ఆధారపడి కొన్ని ఆర్థిక సంబంధాలు ఉన్నా, పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వదనే అభిప్రాయం బలంగా ఉంది. పాక్షిక మౌనం, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ప్రాంతీయ శాంతికి పిలుపునిస్తుంది.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక, ఎవరికీ నేరుగా మద్దతు ఇవ్వదు. కానీ చైనా పట్ల ఉన్న విధేయత దృష్ట్యా ఎటువంటి వైఖరి అవలంబించకుండా తటస్థ వైఖరి తీసుకుని రెండు దేశాలను శాంతి కోరుతూ ప్రకటనలు చేయొచ్చు. నేపాల్ అధికారికంగా తటస్థంగా నిలబడే అవకాశం ఉన్నా, ఆ దేశంలోని చైనా అనుకూల శక్తులు భారత్‌కు వ్యతిరేకంగా మాటల యుద్ధం సాగించవొచ్చు. గతంలో చైనా ప్రోత్సాహంతో నేపాల్ రాజకీయం భారత్ పట్ల అసంతృప్తి చూపిన ఉదాహరణలు ఉన్నాయి. పొరుగు దేశాలతో భారత్ శాంతియుత సంబంధాల కోసం ప్రయత్నించింది వాస్తవం. కానీ పాకిస్థాన్‌తో యుద్ధ పరిస్థితి ఉద్భవిస్తే, వీటి మౌనమే భారత్‌కు ఒంటరిగా మారే ప్రమాదం ఉంది. చైనా మౌన వ్యతిరేకత, నేపాల్ లోని చైనా అనుకూల శక్తులు, శ్రీలంక-బంగ్లాదేశ్ తటస్థత — ఇవన్నీ యుద్ధ వ్యూహం లో భాగం కానున్నాయి. ప్రాంతీయ శాంతిని కాపాడేందుకు దౌత్య సంబంధ ప్రయత్నాలు కొనసాగిస్తూనే , దేశ అంతర్గత భద్రతపై ఏ ఒక్క పరిస్థితినీ తక్కువగా అంచనా వేయడం సరైంది కాదు. ప్రతి పొరుగు దేశ వైఖరిని ముందుగానే అంచనా వేసుకుని వ్యూహాత్మక వ్యవహారం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page