– విద్యార్థులకు మంత్రి వాకిటి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : ఓటమి గెలుపునకు తొలిమెట్టు అని క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలిలో నెల రోజులకుపైగా సాగిన వేసవి శిక్షణ శిబిరం శనివారం జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుండి జూన్ 7 వరకు జరిగిన ఈ సమ్మర్ క్యాంపులో 600 మంది విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతీ సంవత్సరం వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. చిన్నచిన్న సమస్యలకు విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రీడలు మాత్రమే మానసిక, శారీరక ద్రుఢత్వాన్ని కలగజేస్తాయని తెలిపారు. ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ఎలా విజయం సాధించాలనే కసి విద్యార్థుల్లో పెరగాలన్నారు. విద్యార్థులు ఫోన్లకు అలవాటుపడకుండా మైదానాలకు అలవాటుపడాలని హితబోధ చేశారు. మత్తు వదలి మైదానాలు చేరాలనే నినాదంతో ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలియజేశారు. ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని మైదానాలను అభివృద్ధి చేసి మంచి నైపుణ్యం ఉన్న కోచ్లను నియమించనున్నట్లు తెలిపారు. ఈసారి క్రీడలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో భాగంగా దాదాపు మÖడు లక్షల మంది పిల్లలు గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో క్రీడలు ఆడారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు 3వ ఎడిషన్లో ఐదు లక్షలమంది క్రీడాకారులు పాల్గొనేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నామని మంత్రి వాకిటి వెల్లడించారు. సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంవీఆర్ గ్రూవ్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



