- ప్రజా సంబంధాల విషయంలో మేమే బెటర్
- ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్ను దత్తత తీసుకున్నారా? అని ప్రశ్నించారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా సినీ నటులు కొందరు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. పిల్లలకు పుస్తకాలు ఇద్దామని అంటే నాకేం వొస్తుందని ఒక నటుడు అన్నాడని గుర్తుచేశారు. ముప్పై వేల జీతం వొచ్చినా మూడు వేలతో టికెట్ కొని సినీతారల స్టార్ డం కాపాడుతున్నారని, ప్రజలకు కష్టాలు వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ వొస్తారని నమ్మకం లేదన్నారు.
ఈ నటుల కంటే సోనూ సూద్, సమంత, మంచు లక్ష్మి ఎంతో ఆదర్శంగా అంటారని తెలిపారు. వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ కృత్రిమ సమాజంలో బతుకుతున్నారని, అర్ధరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీల్లో ఉంటారు.. ప్రజలకి ఇబ్బందులు వొస్తే కనీసం ఒక్కరూ కూడా స్పందించరు. పాపులారిటీలో సినీ నటుల కంటే రాజకీయ నాయకులు తక్కువగా కనిపిస్తారు.. కానీ ప్రజా సంబంధాల విషయంలో మేం చాల బెటర్ అని వ్యాఖ్యానించారు. ప్రజలను మనుషులుగా చూడాలని, తమిళ నటులకు ఉన్న సామాజిక సృహ తెలుగు నటులకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇండియాలో రికార్డు హిట్స్ ఇచ్చాం కదా వైద్యానికి, చదువుకి దాచుకున్న డబ్బులతో వాళ్ళ సినిమాలకి వెళ్తే అభిమానుల గుండెల్లో గుణపాలు దించుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.