2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేస్తాం

  • సింగపూర్‌తో కలిసి పనిచేస్తాం
  • సింగపూర్‌ ‌ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు.

ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారుతుందన్నారు. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా… ద్వితియ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్ తోపాటు ఇతర నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధుల బృందాన్ని కోరారు. టెక్నాలజీ, స్కిల్ డెవలెప్ మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో కాన్సూల్ వైష్ణవి వాసుదేవన్, ఫస్ట్ సెక్రటరీ(ఎకానమిక్) వివేక్ రఘు రామన్, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్(ఇండియా – సౌత్) డేనిస్ టాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page