- మదీనా బస్సు ప్రమాద మృతులకు అండ
- వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- 44మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందచేత
- సచివాలయంలో బాధిత కటుంబాలకు నేరుగా చెక్కులు
- ప్రభుత్వం అండగా ఉంటుంది
- స్పష్టం చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్,ప్రజాతంత్ర : మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్రెడ్డి పరిహారం (Mecca Bus Accident Compensation) పంపిణీ చేశారు. 44 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేశారు. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున సాయం అందజేశారు. గతేడాది నవంబర్ 17న మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవదహనమైన విషయం తెలిసిందే. మక్కా నుంచి బయలుదేరిన బస్సు ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. మదీనా ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యలపైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని ప్రస్తావించారు. మంత్రి అజారుద్దీన్ను వెంటనే మదీనా పంపించానుని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదని.. కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని అన్నారు.
నాంపల్లి అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రజకు కలిగించామని చెప్పుకొచ్చారు. అందుకే కుటుంబాలను సెక్రటేరియట్కి పిలిచి పరిహారం అందించామని వివరించారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ఆందోళన చెందొద్దని అన్నారు. ప్రజల కష్టం, ఆనందంలో తోడుంటుందని ధైర్యం చెప్పారు. . చనిపోయిన వారి కుటుంబ సభ్యులకుతక్షణమే పాస్పోర్టులు, వీసాలు ఇప్పించి మదీనాపంపించామన్నారు. అక్కడిభారత్ కాన్సులేట్, సౌదీ ప్రభుత్వంతో చర్చించి మృతిచెందిన వారి అంత్యక్రియలు జన్నుతుల్బఖీలోచేయించామన్నారు. ఈ చెక్కులను ఇళ్లకు పంపించవచ్చని.. కానీ అందరితోకలవాలని… మీకు అండగాఉంటామనే భరోసాకల్పించాలనే ఉద్దేశంతోనే సచివాలయానికి పిలిపించామని సీఎం అన్నారు.
ముస్లిం సోదరులతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009సంవత్సరం నుంచి నియోజకవర్గంలోని అయిదు మండలాల నుంచి ఒకొక్కరి చొప్పున ఏటా అయిదుగురిని తన సొంత ఖర్చులతో హజ్ యాత్రకుపంపుతున్నానని సీఎం తెలిపారు. వారిని ఎంపిక చేసే బాధ్యత స్థానిక ముస్లిం మతపెద్దలకే అప్పజెప్పానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, హజ్కమిటీఛైర్మన్ ఖుస్రో పాషా, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ ఛైర్మన్ఫహీంఖురేషి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.





