బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ హాస్పిట్లో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దిల్లీలోని ఇందప్రస్థ అపోలో హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఆయనకు చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అద్వానీ వయసు 97 ఏళ్లు. ఆయన గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పలుమార్లు అస్వస్థతతో దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. తొలుత జూన్ 26న అద్వానీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. జూలై 3న మరోసారి ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయన్ని ఎయిమ్స్కి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 6న మరోసారి హాస్పిటల్లో చేరి చికిత్స అనంతరం ఇంటికి చేరారు. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు.