– కేబినెట్ కీలక నిర్ణయం
– గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆర్డినెన్స్ బిల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించే ఆర్డినెన్స్పై ఆ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు.కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గరకు వెళ్లనుంది. గవర్నర్ ఈ బిల్లును ఆమోదిస్తే వొచ్చే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది. కాగా, 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడానికి ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. 1994 తర్వాత మూడో సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మారారు.1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇద్దరు పిల్లల నిబంధనను టచ్ చేయలేదు. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే.. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 2024 డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. తాజాగా ఇవాళ జరిగిన కేబినెట్..పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేతకు ఆమోదం తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





