పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్
ప్రత్యేక విద్యావిధానం తయారు చేసుకోవాలి
టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
అంగన్వాడీల ద్వారానే ప్రాధమిక విద్య : ప్రొఫెసర్ రమా మేల్కొటే
జాతీయ విద్యా విధానం ఇల్లీగల్ పాలసీ : ప్రొఫెసర్ శాంతా సిన్హా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : అధికారం, సంపద, జ్ఞానం గ్రామస్థాయి వరకు వెళ్లాలని రాజ్యాంగం చెబుతుందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. అధికారం, సంపద కొందరి చేతుల్లోకే వెళ్లిందని, కనీసం విద్యా విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలి, జ్ఞానం సమాజాన్ని మారుస్తుందని అన్నారు. గురువారం బషీర్ బాగ్ లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన సెమినార్ లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శాంత సిన్హా, ప్రొఫెసర్ రామ మేల్కొటే, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ జాతీయ విద్య విధానాన్ని యధావిధిగా అమలు చేయడం సాధ్యం కాదన్నారు.
రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక విద్యా విధానం తయారు చేసుకోవాలన్నారు. జాతీయ విద్య విధానం తెలంగాణ ప్రాంతంలో పనికి రాదని అన్నారు. మన చరిత్ర, సంప్రదాయాలపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన అస్తిత్వం, చరిత్ర ఉందన్నారు. జాతీయ విద్య విధానం ద్వారా అవి కనుమరుగు అవుతాయన్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం రాష్ట్రం కోసం ప్రత్యేక విద్య విధానం తీసుకురావాలన్నారు. ప్రొఫెసర్ రమ మేల్కొటే మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య అందుతుందన్నారు. కానీ వారికి కూడా సరైన జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోవడం బాధాకరం అన్నారు.
నేడు విద్య ప్రమాణాలు దిగజారిపోయాయన్నారు. నాణ్యమైన విద్య , పౌష్టిక ఆహారం ఎంతమందికి అందుతుంది? గ్రామీణ ప్రాంతంలో విద్య ప్రమాణాలు పెంచాలన్నారు. అప్పటి వరకు ఎన్ని కొత్త పాలసీలు వొచ్చిన ఉపయోగకరం కావన్నారు. ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ ప్రజాస్వామ్యవాదులు జాతీయ విద్య విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. లేకపోతే భవిష్యత్ తారలు క్షమించవన్నారు. జాతీయ విద్య విధానంపై ఎలాంటి చర్చలు జరగకుండా అమలు చేయాలని చూస్తున్నారన్నారు. ఇది దొంగచాటున వొచ్చిన పాలసీ అన్నారు. విద్య అనేది ప్రాథమిక హక్కు, కానీ ఈ పాలసీలో ఆ ప్రస్తావన లేదన్నారు. విద్య హక్కు చట్టాన్ని కూడా విస్మరించారన్నారు. ఇది ఇల్లిగల్ పాలసీ అన్నారు.