హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నాస్కామ్ భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ తో ఆయన పలు అంశాలపై చర్చించారు. కృత్రిమ మేథ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ ఉద్యోగులకు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడంలో నాస్కామ్ కీలక పాత్ర పోషించాలని ఆయన అభిలషించారు. హైదరాబాద్ జిసిసిల గమ్యస్థానంగా మారిందని, కొత్త సంస్థలు ఇక్కడ అడుగుపెట్టేందుకు నాస్కామ్ తన పలుకుబడిని ఉపయోగించాలని కోరారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా వృద్ధి చెందుతుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచస్థాయి ఎకో సిస్టమ్ను నెలకొల్పామని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, నాస్కామ్ ప్రతినిధులు శ్రీకాంత్ శ్రీనివాసన్, ప్రవీణ్, ప్రభుత్వ ఐటీ వ్యూహకర్త శ్రీకాంత్ లు పాల్గొన్నారు.
ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
తెలంగాణను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కృత్రిమ మేధ, జీవశాస్త్రాలు, టెక్నాలజీ రంగాల్లో దిగ్గజ సంస్థలను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచిందని ఆయన తెలిపారు. బుధవారం న్యూజెర్సీ ఇన్నోవేషన్స్ ఇన్ స్టిట్యూట్, న్యూజెర్సీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతో, టీ-హబ్ ఫౌండేషన్ వాణిజ్య, సాంకేతిక ఆవిష్కరణల భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా భారతీయ అమెరికన్లు, వృత్తి నిపుణులకు న్యూజెర్సీ అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం ఇతోధిక అభివృద్ధిని సాధిస్తుందన్న ఆశాభావం తనకు ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అవగాహన ఒప్పంద కార్యక్రమంలో న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ తాహెషా వే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీ హబ్ సిఇఓ సుజిత్ జాగిర్దార్, చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండేపూడి తదితరులు పాల్గొన్నారు.