- కొంతకాలంగా గంభీరంగా ఓపికతో చూస్తున్నా…
- సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఏమయ్యాయి?
- కాంగ్రెస్ పాలనలో అంతా అసంతృప్తే, అన్ని వర్గాలను ముంచారు..
- ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడదాం…
- కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించిన కేసీఆర్
‘ఇన్ని రోజులు గంభీరంగా మౌనంగా ఉన్నాను. ఓపిక పట్టుకుని చూస్తున్నా…నేను కొడితే మామూలుగా ఉండదు.. గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు’ అని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైనశైలిలో గర్జించారు. గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుంచి వందలాది మంది ఉద్యమకారులు, బిఆర్ ఎస్ నాయకులు, అభిమానులు కేసీఆర్ను కలిసేందుకు గత ఐదు రోజులుగా 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశానికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై ప్రసంగించారు.
ఈ సమావేశంలో మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన తర్వాత సుమారు 14 నెలలు ఓపిక పట్టామని , వారు చేస్తున్న దుర్మార్గపు పాలనతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమాలు చేసి పోరాడితే తెలంగాణ వొచ్చిందని , ఆ వొచ్చిన తెలంగాణను పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఒక గాడిలో పెట్టిందని గుర్తుచేశారు.
బిఆర్ఎస్ హయాంలో దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపితే.. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో తెలంగాణను నాశనం చేస్తూ ప్రజలను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వొచ్చిన ఆరేడు నెలల్లోనే బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిందని, పెద్ద పెద్ద సిపాయిల్లాగా భావించే కాంగ్రెస్ వాళ్లు గతంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని కేసీఆర్ ప్రశ్నించారు.