సరిహద్దుల వెంట ఆగని పాక్ కాల్పులు
ఆర్మీ హెడ్ క్వార్టర్స్.. విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు
గురుద్వారాలపైనా దాడులకు యత్నం
పాక్ డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తింపు
అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం
భారత రక్షణ శాఖ వెల్లడి
భారత ఆర్మీ ప్రతిదాడితో పాక్కు కోలుకోలేని నష్టం
అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు
న్యూదిల్లీ, మే 9: భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడిందని, అయితే వాటిని దీటుగా భారత సైన్యం తిప్పికొట్టిందని రక్షణశాఖ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ ఈ దాడులకు పాల్పడినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు. భారత సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది.
పాక్ దాడులను డ్రోన్లతో తిప్పికొట్టాం. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్ దాడులకు పాల్పడింది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు 36 చోట్ల దాడులు చేసింది. కైనటిక్, నాన్ కైనటిక్ సాధనాలతో భారత్ పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తించాం. బఠిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారు. అయితే, పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం అని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. భారత మిలిటరీ బేస్లు టార్గెట్గా పాక్ దాడులు జరిగాయని సోఫియా ఖురేషి తెలిపారు. ఉత్తర ప్రాంతంలోని 26 ప్రదేశాలు టార్గెట్గా పాక్ దాడులు చేసిందని, పాక్ డ్రోన్లను భారత బలగాలు కూల్చివేశాయని వెల్లడించారు. ఇక, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పిన వివరాల ప్రకారం భారత్ దాడిలో పాక్కు తీవ్ర నష్టం కలిగింది. పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడి చేసింది. కరాచీ-లాహోర్ మధ్య విమానాలు తిరుగుతున్నాయి. మన వాయుసేన ఎంతో సంయమనం పాటిస్తోంది. ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందిని వ్యోమికా సింగ్ తెలిపారు.
భారత నగరాలు లక్ష్యంగా పాక్ దాడులు
అన్నింటినీ విజయవంతంగా తిప్పికొట్టాం..
ఇక, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. గత రాత్రి పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం. పలు భారత నగరాలు లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. నిన్నటి దాడుల్లో పాకిస్థాన్కే ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. ప్రధానంగా ఆర్మీ హెడ్ క్వార్టర్లు, విమనాశ్రయాలు లక్ష్యంగా పాక్ దాడులు చేసిందన్నారు. సరిహద్దుల వెంట నిరంతరంగా పౌరులపై కాల్పులు సాగిస్తోందన్నారు. వీటన్నింటిన సైన్యం దీటుగా ఎదుర్కొందన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియేకు చెందిన ’ఆసిస్గార్డ్ సోంగర్’ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసిందన్నారు. కల్నల్ సోఫియా ఖురేషి అందించిన వివరాల ప్రకారం.. భారత్లోని సరిహద్దు జిల్లాలపై పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమృత్సర్లోని ఓ గ్రామంలో పంటపొలాల్లో గురువారం పేలని పదార్థాలను అధికారులు గుర్తించారు. అనంతరం సైన్యానికి సమాచారం అందించారు. వాటిని సేకరించిన భారత సైన్యం.. విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఆపరేషన్ సిందూర్’తో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇకపోతే గురుద్వారాలపై దాడి చేయడం ద్వారా మతపరమైన ఉద్రిక్తతలకు పాక్ యత్నించిందని, అయితే దీనిని కూడా తిప్పికొట్టామని మిస్రీ తెలిపారు. ఇకపోతే అనేక రకాలుగా దుష్ప్రచారాలు, ఫేక్ వార్తల ప్రచారంతో పాక్ హంగామా సృష్టిస్తోందన్నారు. పాక్ రెచ్చగొట్టే చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని అత్యవసర వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఈ క్రమంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో , విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. చొరబాటు ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో పాక్తో సరిహద్దు పంచుకుంటున్న ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు చేపట్టాయి. మన దేశంలోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్కు చెందిన వ్యక్తిని పంజాబ్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్కు చెందిన జవాన్లు హతమార్చిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లో 1,037 కిలోటర్లున్న పాక్ సరిహద్దును మూసివేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీర్లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ నేడు కూడా నియంత్రణ రేఖకు ఆవలివైపు నుంచి భారీస్థాయిలో షెల్లింగ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉరి, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇళ్లు ఖాలీ చేసి వెళుతున్నారు.