– అధికారుల అండతో కబ్జా అని పలువురి అనుమానాలు
– అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు
– జమ్మిగడ్డ ప్రభుత్వ స్థలాన్ని సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
– స్థలాన్ని చదును చేసి ఫెన్సింగ్ వేస్తున్న రెవెన్యూ అధికారులు
కాప్రా, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 :ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. జమ్మిగడ్డలోని 199/1, 376 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలను చూసి అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ ఇలాంటి పరిస్థితులున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆదికారుల హస్తం ఉందేమోనని ప్రజలు, రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇళ్ళు నిర్మించడానికి కనీసం 4 నుండి 6 నెలల కాల వ్యవధి పడుతుంది. అలాంటప్పుడు అధికారులు నిద్రపోతున్నారా, వారి అలసత్వానికి కారణాలు ఏంటి? టౌన్ ప్లానింగ్, మండలస్థాయి రెవిన్యూ అధికారుల ఏం చేస్తున్నారు అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జర్నస్టుల సమాచారంతో విషయం తెలుసుకొని స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ బోర్డు నాటడం మండల రెవెన్యూ అధికారుల తంతుగా కొనసాగుతోంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు, రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో సుమారు సంవత్సర కాలంగా సర్వేనెం.199/1, 376 ప్రభుత్వ భూములలో అక్రమంగా డూప్లెక్స్ , బహుళ అంతస్థులు కడుతున్నా కూతవేటు దూరంలో ఉన్న మండల రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలేదు. జర్నలిస్టుల సమాచారంతో హుటాహుటిన స్థలాన్ని సందర్శించి త్వరలో స్థలానికి ఫెన్సింగ్ వేస్తామని అధికారులు ప్రగల్బాలు పలకడం శోచనీయం. ఈ సందర్భంగా తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ స్థలాన్ని వెంటనే ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకుంటామని, ఇప్పటికే నిర్మాణం జరిగిన ఇండ్లకు నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారులు ఇప్పటికే స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థలాన్ని పరిశీలించిన వారిలో ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, కాప్రా సర్కిల్ ఏసిపి ఎన్.కృష్ణమోహన్, కాప్రా డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, సర్వేయర్ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





